ScienceAndTech

మస్క్-నాసా డీల్‌పై బీజోస్ ఫిర్యాదు

మస్క్-నాసా డీల్‌పై బీజోస్ ఫిర్యాదు

చంద్రుడిపైకి మానవులను పంపేందుకు స్పేస్‌ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జాబిల్లి పైకి మానవులను పంపడానికి స్పేస్‌ ఎక్స్‌, బ్లూ ఆరిజిన్‌ సంస్ధలు సమాయత‍్తం అయిన విషయం తెలిసిందే. అందుకోసం ఈ సంస్థలు ప్రస్తుతం చంద్రుడిపైకి మానవులను పంపే రాకెట్‌ తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బిలియనీర్‌ అమెజాన్‌ అధినేత జెఫ్‌ బేజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సంస్థ నాసాపై సంచలన ఆరోపణలు చేస్తూ ఫెడరల్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ కార్యాలయంలో సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. నాసా చివరినిమిషంలో చంద్రుడిపై మానవులను పంపే మూన్‌ల్యాండర్‌ విషయంలో సుమారు రూ. 21,650 కోట్ల ఒప్పందాన్ని స్పేస్‌ఎక్స్‌కు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఈ ఒప్పందాన్ని బ్లూ ఆరిజిన్‌ సంస్ధ సవాలు చేసింది. నాసా చివరి నిమిషంలో ఏ ఇతర కాంట్రాక్ట్‌ బిడ్డింగ్‌ లేకుండా ఈ భారీ ఒప్పందాన్ని ఏకపక్షంగా స్పేస్‌ఎక్స్‌ సంస్థకు తరలించిందని బ్లూ ఆరిజిన్‌ ఆరోపించింది. నాసా ఈ నెల ప్రారంభంలో స్పేస్‌ఎక్స్‌కు చంద్రుడిపైకి వ్యోమగాములను తీసుకెళ్లే అంతరిక్ష నౌకను నిర్మించే కాంట్రాక్ట్‌ను ఇచ్చింది. స్పేస్‌ ఎక్స్‌ సంస్ధ 2024 సంవత్సరం లోపు వ్యోమగాములను చంద్రుడిపైకి తీసుకెళ్లనుంది. కాగా నాసా 1972 తరువాత మరొసారి మానవులను చంద్రునిపైకి పంపిచాలని లక్ష్యంగా పెట్టుకుంది. నాసా తీసుకున్న ఏక పక్ష నిర్ణయంతో ఇతరులకు పోటీపడే అవకాశం లేకుండా చేస్తోందని బ్లూ ఆరిజిన్‌ సంస్థ తన పిటిషన్‌లో దాఖలు చేసింది. ఈ ఒప్పందం కోసం ఎలన్‌ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ ఒంటరిగా బిడ్ చేయగా, అమెజాన్ వ్యవస్థాపకుడు బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ, లాక్‌హీడ్ మార్టిన్, నార్త్రోప్ గ్రుమ్మన్, డ్రేపర్‌ల కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ నాసాపై నిరసన వ్యక్తం చేస్తూ 50 పేజీల పిటిషన్‌ను ఫెడరల్ గవర్నమెంట్ లో దాఖలు చేసింది.