Politics

తన జాతకం బయటపెట్టాలని రేవంత్ సవాల్

తన జాతకం బయటపెట్టాలని రేవంత్ సవాల్

దేవరయాంజల్ భూముల్లో 212 నుంచి 218 సర్వే వరకు 84 ఎకరాల నిషేధిత జాబితాలో దేవుడి భూములు తెగనమ్ముతున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. దేవరయాంజాల్‌ భూములను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భాగస్వామిగా ఉన్న ఓ పత్రిక తెలంగాణ కార్యాలయాన్ని అనుమతులు లేకుండా నిర్మించారని తెలిపారు. కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్‌రావు శ్రీని డెవలపర్స్‌ పేరుతో దేవుడి భూములు వెంచర్ చేసి అమ్ముతున్నారని చెప్పారు. 657 సర్వే నెంబర్‌లో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ ఫామ్‌హౌస్ ఉందన్నారు. ‘‘మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇక్కడ నుండే రాజకీయాలు చేస్తారు. కేటీఆర్ పక్షాన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వ్యవహారాలు చక్కపెడుతున్నారు. టీఆర్‌ఎస్‌ నేతల నిర్మాణాలు, అనుమతులపై విచారణ చేయాలి. కేసీఆర్ తిని వదిలేసిన బొక్కలు తినే వారు నా జాతకం బయట పడుతుంది అంటున్నారు. దమ్ముంటే రండి.. నా జాతకం బయట పెట్టండి. ఈ భూములు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. కేటీఆర్ సన్నిహితుడు శ్రీధర్ మీద విచారణ జరగాలి.’’ అని రేవంత్‌ డిమాండ్ చేశారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నిజనిర్థారణ కమిటీ దేవరయాంజాల్‌లో పర్యటించింది. దేవరాయాంజల్ వివాదాస్పద భూములను పరిశీలించారు. ఆలయ భూముల్లో పలువురు నేతలు కబ్జాలు చేసినట్లు గుర్తించింది. టీఆర్‌ఎస్‌ సహా పలు పార్టీల ముఖ్య నేతలకు దేవరయాంజాల్‌లో గోదాంలు, ఫామ్‌హౌస్‌లు ఉన్నట్లు గుర్తించారు. సర్వే నంబర్ 437, 438 భూములనూ పరిశీలించారు. 437 సర్వే నంబర్‌లో నిర్మాణ అనుమతుల వివరాలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను రేవంత్‌రెడ్డి ఫోన్‌లో కోరారు. ఇటీవల ఈటల వివాదంతో ఈ భూముల అంశం వెలుగులోకి వచ్చింది.