WorldWonders

నాలుగు వారాల పాటు మత్తులో జోగారు

నాలుగు వారాల పాటు మత్తులో జోగారు

ఒకటీ రెండూ రోజులు కాదు ఏకంగా నాలుగు వారాల పాటు నగరమంతా మత్తులో జోగిందంటే నమ్మగలరా? రష్యాలో జరిగిందిది. 1917లో జార్‌ పాలనకు అంతం పలుకుతూ సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటు దిశగా తిరుగుబాటు చెలరేగింది. ఆ ఏడాది అక్టోబర్‌లో బోల్ష్‌విక్‌ ప్రజావిప్లవకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఇది అప్పటి రష్యన్‌ చక్రవర్తుల పరిపాలన కేంద్రమైన పెట్రోగార్డ్‌ (ఇప్పటి సెయింట్స్‌ పీటర్స్‌బర్గ్‌) నగరంలో మొదలయ్యింది. ఈ నగరంలో చక్రవర్తి అధికారిక నివాసం అయిన వింటర్‌ ప్యాలెస్‌ను విప్లవకారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సోవియట్‌ యూనియన్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు వారు భావించారు. ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో వారికి విశాలమైన వింటర్‌ ప్యాలెస్‌ భవనంలో ప్రపంచంలోనే అతిపెద్ద వైన్‌ సెల్లార్‌ కనపడింది. అందులో సుమారు 100 మిలియన్‌ డాలర్ల విలువైన మందు ఉంది. దీంతో బోల్ష్‌విక్‌ సైనికులు ఉత్సాహంగా ఆ మందు తాగి, చిందులు వేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నగరంలోని పౌరుల చెవిన పడింది. వెంటనే వారూ ఆ భవనానికి చేరుకొని తాగడం మొదలుపెట్టారు. ఇలా ఏకంగా నాలుగు వారాల పాటు తాగుతూ, మత్తులోనే జోగుతూ ఉండిపోయారంతా. చివరికి సెల్లార్‌లోని మందు అయిపోవడంతో వాళ్ల హ్యాంగోవర్‌కు బ్రేక్‌ పడింది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం మత్తులో జోగిన సంఘటన (బిగ్గెస్ట్‌ హ్యాంగోవర్‌)గా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఈ వింటర్‌ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు.