Politics

ఈటల కుమారుడిపై విచారణకు కేసీఆర్ ఆదేశం

cm-kcr-orders-eetala-rajendar-son-nithin-reddy-be-enquired

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందింది. తన భూమిని నితిన్‌ కబ్జా చేశారంటూ మేడ్చల్‌ మండలం రావల్‌కోల్ వాసి మహేశ్‌ ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ సీఎంకు విన్నవించుకున్నారు. మహేశ్‌ ఫిర్యాదు నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) విజిలెన్స్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. మెదక్‌ జిల్లా అచ్చంపేట, హకీంపేటలో భూకబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలు, ప్రభుత్వ విచారణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవల ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిపై భూకబ్జా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు అందడంతో సీఎం విచారణకు ఆదేశించారు.