Sports

ఒలంపిక్ పతకశాలి…అద్దె కోసం హత్యచేసి జైలుకు వెళ్లాడు

Olympic Wrestler Susheel Kumar Goes To Jail Over Murder For Rent

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్‌లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు.. దేశంలో అతడిని వరించని క్రీడా పురస్కారం లేదు.. ఎంతోమంది యువకులు అతడిని చూసి పహిల్వాన్‌ అవ్వాలని జిమ్‌లలో చేరారు. అలాంటి వ్యక్తి తన శిష్యుడినే హత్య చేశాడనే ఆరోపణలపై కొన్నాళ్లపాటు పరారయ్యాడు.. అతడిపై పోలీసులు రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసులకు దొరికి జైలుపాలయ్యాడు. అతడే రెజ్లింగ్‌ ఛాంపియన్‌ సుశీల్‌కుమార్‌..!

*** ఇంటి అద్దె గొడవ..
సుశీల్‌ కుమార్‌కు దిల్లీలోని మోడల్‌ టౌన్‌లో ఒక ఇల్లు ఉంది. దానిలో రెజ్లర్‌ సాగర్‌ కుమార్‌ ధన్‌కర్‌ కొన్నాళ్లు అద్దెకు ఉన్నాడు. ఈ క్రమంలో అతను అద్దె సరైన సమయానికి చెల్లించలేదు. దీంతో సుశీల్‌, అతనికి మధ్య వివాదం చోటు చేసుకొంది. అప్పట్లో సాగర్‌ను ఖాళీ చేయించడానికి సుశీల్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. దీనికి అతడి బంధువు ఆనంద్‌ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. దీంతో సాగర్‌ నాలుగు నెలల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే చోటుకు మారిపోయాడు. ఆ తర్వాత నుంచి సుశీల్‌ కుమార్‌ను సాగర్‌ అందరి ఎదుట దూషించడం మొదలుపెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని సుశీల్‌ ఆగ్రహం చెందాడు.

*** స్టేడియం వద్ద ఘర్షణ..
మే 4వ తేదీ అర్ధరాత్రి ఛెత్రసాల్‌ స్టేడియం వద్ద సుశీల్‌, ఆయన బృందం హాకీ బ్యాట్లు, క్రికెట్‌ బ్యాట్లతో తమపై దాడి చేసిందని క్షతగాత్రుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో సుశీల్‌ అక్కడే ఉన్నారని చెప్పారు. వారి కార్లలో హాకీ బ్యాట్లు, క్రికెట్‌ బ్యాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో స్టేడియంలో అథ్లెట్లు ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం రాత్రి 2 గంటల సమయంలో సుశీల్‌ కుమారే పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి స్టేడియం వద్ద ఘర్షణ జరిగినట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఐదుకార్లు ఆపి ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఒక స్కార్పియో కారులో తూటాలు నింపి ఉన్న డబుల్‌ బ్యారెల్‌ గన్‌, మూడు కార్ట్రెడ్జ్‌లు దొరికాయి. ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నారు. వారిలో సాగర్‌ చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్‌ బృందం చేసిన దాడిలో సోను మోనల్‌, అమిత్‌ కుమార్‌ అనే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు సుశీల్‌ కుమార్‌ పై ఆరోపణలు చేశారని డీసీపీ జి.ఎస్‌.సిద్ధు తెలిపారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రిన్స్‌ దలాల్‌ అనే రెజ్లర్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి సుశీల్‌ పరారీలో ఉన్నాడు. అతడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

*** సాగర్‌ ఎవరు..?
సాగర్‌ ధన్‌కర్‌ హరియాణాలోని సోనిపట్‌కు చెందిన యువకుడు. అతడు సుశీల్‌ విజయాలను చూసి.. స్ఫూర్తి పొంది రెజ్లర్‌గా మారాడు. దాదాపు 8 ఏళ్ల పాటు దిల్లీలోని ఛెత్రసాల్‌ స్టేడియంలో శిక్షణ పొందాడు. 23 ఏళ్ల సాగర్‌ కూడా రోమన్‌స్టైల్‌ రెజ్లింగ్లో 97 కిలోల విభాగంలో జూనియర్‌ నేషనల్‌ ఛాంపియన్‌. సాగర్‌.. సుశీల్‌ కుమార్‌ను తన గరువుగా భావిస్తాడని అతడి తండ్రి అశోక్‌ ధన్‌కర్‌ మీడియా ఎదుట చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. అశోక్‌ దిల్లీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. సుశీల్‌ కుమార్‌ స్వయంగా సాగర్‌, సోను, అమిత్‌లను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఛెత్రసాల్‌ స్టేడియానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న అనుచరుల సాయంతో దాడి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు మొబైల్‌లో చిత్రీకరించిన వీడియో పోలీసులకు లభించినట్లు సమాచారం. గాయపడిన సాగర్‌ 5వ తేదీన మరణించాడు. అప్పటి నుంచి సుశీల్‌ కుమార్‌ అదృశ్యం అయిపోయాడు. ఈ విషయం పోలీసులకు అనుమానం పెంచింది. తొలుత ఓ బాబా ఆశ్రమంలో దాక్కొన్నట్లు సమాచారం లభించడంతో అక్కడ తనిఖీలు చేశారు. ఆ తర్వాత సుశీల్‌ కారులో ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది.

*** సుశీల్‌ ప్రతిష్ఠ దెబ్బతింది ఇలా..
ఇండియన్‌ రైల్వేస్‌లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సుశీల్‌ కుమార్‌ను కొన్నాళ్ల క్రితం ఛెత్రసాల్‌ స్టేడియానికి ఓఎస్‌డీగా నియమించారు. ది స్కూల్‌ గేమ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడు కూడా. ఈ ఫెడరేషన్‌కు గుర్తింపులేదు. ఇక స్టేడియం ఇన్‌ఛార్జి సత్పాల్‌ స్వయాన సుశీల్‌ కుమార్‌కు మావయ్య. దీంతో సుశీల్‌ మాటకు స్టేడియంలో ఎదురులేదు. 2012 ఒలింపిక్స్‌ తర్వాత సుశీల్‌ చాలా వ్యాపారాలను మొదలుపెట్టారు. ఒక దశలో దిల్లీ చుట్టుపక్కల టోల్‌ప్లాజాల కాంట్రాక్టులు అత్యధికంగా అతడికే దక్కాయి. దీంతో పాటు ఆయన చెడు స్నేహాలకు అలవాటు పడినట్లు కథనాలు వెలువడ్డాయి. కొన్నేళ్ల క్రితం సుశీల్‌ అనుచరులు పర్వీన్‌ రాణా అనే రెజ్లర్‌ పై దాడి చేశారు. ఈ ఘటనలో సుశీల్‌ నేరుగా పాల్గొనలేదు. నర్సింగ్‌ యాదవ్‌ అనే రెజ్లర్‌ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి సస్పెండ్‌ కావడం వెనుక సుశీల్‌ హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి.