WorldWonders

12మందికి ఉరిశిక్ష వేసిన ఒంగోలు జడ్జి-తాజావార్తలు

12మందికి ఉరిశిక్ష వేసిన ఒంగోలు జడ్జి-తాజావార్తలు

* హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష విధించింది. 13 ఏళ్ల కిందట హైవేపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను మున్నా గ్యాంగ్‌ హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఎట్టకేలకు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు లారీ డ్రైవర్‌, క్లీనర్‌లను దారుణంగా హత్య చేశారని తేలడంతో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 11 మందికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. వీరిలో ముగ్గురిని రెండుసార్లు ఉరి తీయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. 2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై ప్రత్యేక నిఘా పెట్టారు. సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు నిందితులకు ఉరి శిక్ష విధిస్తు ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

* బంగాళఖాతంలో ఏర్పడిన యాస్‌ తుపాను పరిస్థితులపై ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులుతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్.

* బనగానపల్లె టిడిపి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు,

* నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమ్మరీని కోరారు.

* విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో మావోయిస్టు విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ పేరిట పోస్టర్లు వెలిశాయి.జి. మాడుగుల మండలం మద్దిగారు గ్రామ పరిసర ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు.

* గుంటూరు జీజీహెచ్ వద్ద తెదేపా నేత జీవీ ఆంజనేయులును పోలీసులు అడ్డుకున్నారు.

* * దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టే కనబడుతోంది. గత 17 రోజులుగా కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలే ఇందుకు ఉదాహరణ. గత 15 వారాలుగా దేశంలో కరోనా పరీక్షలు 2.6రెట్లు పెరగ్గా.. గత రెండు వారాలుగా వీక్లీ పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టినట్టు కేంద్ర గణాంకాలు సూచిస్తున్నాయి.

* దేశంలో రాబోయే థర్డ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ చిన్నారులపైనే అధిక ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్‌వేవ్‌లో ఈ వైరస్‌ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న సూచనలు ఇప్పటికైతే ఏమీ లేవని స్పష్టంచేశారు. పిల్లలకు అధిక ముప్పు ఉంటుందంటూ వస్తోన్న వార్తలు వాస్తవాల ఆధారంగా చెప్పింది కాదని పిడియాట్రిక్స్‌ అసోసియేషన్‌ పేర్కొంటోందన్నారు. కరోనా వైరస్‌ చిన్న పిల్లలపై ప్రభావం చూపించకపోవచ్చని, ప్రజలు భయపడొద్దని ఆయన సూచించారు.

* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంలో హానికారమైన పదార్థాలేవీ లేవని ఆయుష్‌ విభాగం స్పష్టం చేసింది. ఔషధం కోసం మొత్తం 18 మూలికలు వాడినట్లు తెలిపింది. వాటిపై పూర్తిగా చర్చించామని, వివరాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తెలిపామని ఆయుష్‌ కమిషన్‌ రాములు మీడియాకు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. ఆ మందుతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని ఆయన అన్నారు.

* టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారు ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దే ఆన్‌సైట్‌ లేదా వాక్‌-ఇన్‌ (అప్పటికప్పుడు) రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా వేయించుకోవచ్చని తెలిపింది. వ్యాక్సిన్‌ వృథాను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

* కొవిడ్‌ రోగులకు చికిత్సలో ఉపయోగించే యాంటీబాడీ కాక్‌టెయిల్‌ (కాసిరివిమాబ్‌, ఇమ్డివిమాబ్‌) భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఔషధ తయారీ సంస్థ రోచ్‌ ఇండియా, సిప్లా సంయుక్తంగా ఈ ఔషధాన్ని మార్కెట్‌లోకి విడుదల చేశాయి. దీని ధర డోసుకు రూ.59,750గా నిర్ణయించినట్లు ఈ సంస్థలు ప్రకటించాయి. తొలి బ్యాచ్‌లో భాగంగా లక్ష ప్యాక్‌లను ప్రస్తుతం మార్కెట్‌లోకి విడుదల చేశారు. జూన్‌ మధ్య కాలం నాటికి రెండో బ్యాచ్‌ ప్యాక్‌లు అందుబాటులోకి తెస్తామని ఆ సంస్థలు ప్రకటించాయి. ఒక్కో ప్యాక్‌ను ఇద్దరు రోగులకు అందించవచ్చు.

* కరోనా వైరస్‌ను అంతమొందించేందుకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన పలు వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయినా కొత్తరకాలు వెలుగు చూడడం, వ్యాక్సిన్‌ల వల్ల పొందే రోగనిరోధక సామర్థ్యం కొంతకాలం వరకే పరిమితమవుతుందన్న నిపుణుల అంచనాలతో బూస్టర్‌ డోసుల అవసరం ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ సంస్థలు ఇప్పటికే వాటిపై దృష్టి పెట్టాయి. తాజాగా స్వదేశంలో అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ బూస్టర్‌ డోసు ప్రయోగాలను భారత్‌ బయోటెక్‌ ప్రారంభించింది. ఇందుకోసం దాదాపు 190 మందిపై ఆరు నెలలపాటు అధ్యయనం చేపట్టనున్నారు.

* కరోనా సమయంలో రేషన్‌ దుకాణాల వద్దకు వచ్చి ఆహార ధాన్యాలు తీసుకోలేని వారి విషయంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఇంటి వద్దకే వెళ్లి ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు గోవా పౌరసరఫరాల శాఖమంత్రి గోవింద్‌ గౌడె తెలిపారు. దుకాణాల వద్దకు వచ్చి దాదాపు 90శాతం మంది ఆహార ధాన్యాలను తీసుకెళ్తున్నారని, 10శాతం మంది మాత్రమే రాలేకపోతున్నారని వివరించారు. వీరిలో కరోనా రోగులు, సీనియర్‌ సిటిజన్లు ఉన్నారని, వారికి తమ సిబ్బందే స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి రేషన్‌ అందజేస్తారని మంత్రి వివరించారు.

* దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న వేళ టీకాల బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై హెచ్చరించారు. ఎవరైనా బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడినట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో నెలకొన్న టీకా కొరత సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రభుత్వ/ ప్రైవేటు ఆస్పత్రుల్లో కింది స్థాయి ఉద్యోగులు కొందరు వ్యాక్సిన్‌ దుర్వినియోగం/ బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారన్నారు. దురదృష్టవశాత్తూ వీరిలో కొందరు వైద్యులు కూడా ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు కాగా.. దర్యాప్తు కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడే ఔషధాలని, వీటి వినియోగం, నిర్వహణపై జవాబుదారీతనం అవసరమన్నారు.

* కరోనా కట్టడికి బిహార్‌లో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించారు. లాక్‌డౌన్‌తో అమలుచేస్తున్న కఠిన ఆంక్షలు సత్ఫలితాలు ఇస్తున్నందున జూన్‌ 1వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం నీతీశ్‌ కుమార్‌ ట్విటర్‌లో ప్రకటించారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌లోనూ లాక్‌డౌన్‌ పొడిగించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూ మంగళవారం ఉదయం 6గంటలతో ముగియనుండటంతో.. లాక్‌డౌన్‌ను జూన్‌ 1 వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

* దేశంలో కరోనా వైరస్‌ రెండో దశ విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అవసరమైన వైద్యశాలలకు దశల వారీగా 2 వేల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు (10 లీటర్ల సామర్థ్యం గలవి) అందజేస్తామని బీసీసీఐ సోమవారం ప్రకటించింది.

* నీటిపారుదల శాఖ ఇంజినీరుపై కడప జిల్లా బుగ్గవంక నిర్వాసితులు దాడి చేశారు. బుగ్గవంక సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనుల కోసం జేసీబీలతో ఇళ్లను కూల్చివేయడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా సాగుతున్న కూల్చివేతను అడ్డుకున్న గుర్రాలగడ్డ ప్రజలు ఇంజినీరు రుఘునాథ్‌ రెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఆ ప్రాంతానికి ఒంటరిగా వచ్చిన ఇంజినీరు బాధితుల ఆగ్రహంతో భయపడిపోయారు. వెంటనే బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగులు తీశారు. తనపైన జరిగిన దాడిపై ఆయన ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఫోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశముంది.

* నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంలో హానికారమైన పదార్థాలేవీ లేవని ఆయుష్‌ విభాగం స్పష్టం చేసింది. ఔషధం కోసం మొత్తం 18 మూలికలు వాడినట్లు తెలిపింది. వాటిపై పూర్తిగా చర్చించామని, వివరాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తెలిపామని ఆయుష్‌ కమిషనర్‌ రాములు మీడియాకు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. ఆ మందుతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని ఆయన అన్నారు.