WorldWonders

రోడ్డెక్కితే కోర్టుకే

రోడ్డెక్కితే కోర్టుకే

లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా వాహనాలతో రోడ్లపై తిరిగితే పెద్ద మూల్యమే చెల్లించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఈ-పాస్‌ లేకుండా తిరుగుతున్న వాహనాల్ని పోలీసులు ఎక్కడికక్కడ స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలా జప్తు చేసిన వాహనాల్ని లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు తమ అధీనంలోనే ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆయా వాహనాలు రోజుల తరబడి వినియోగించక దెబ్బతినే అవకాశాలున్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం ఉల్లంఘనులపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆ వాహనంపై గత లాక్‌డౌన్‌లోనూ ఉల్లంఘనలుంటే.. ‘రిపీటెడ్‌ అఫెండర్లు’గా పరిగణించి అదనంగా కేసులు నమోదు చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ క్రమంలో బండి జప్తు అయిన వాహనదారులు కోర్టుల మెట్లాక్కిల్సి ఉంటుంది. అక్కడ న్యాయమూర్తి విధించే జరిమానా చెల్లించి ఆ రసీదుని పోలీస్‌ స్టేషన్‌లో చూపించాలి. ఆయా వాహనాలపై గతంలో జారీ అయిన ఈ-చలానాల బకాయిలుంటే వాటినీ చెల్లించాకే పోలీసులు వాహనాన్ని వదిలిపెడతారు.