Health

కేసీఆర్‌కు కొత్త తలనొప్పి

కేసీఆర్‌కు కొత్త తలనొప్పి

కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్‌ డాక్టర్లు (జూడా) సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా తక్షణమే విధుల్లో చేరాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎస్‌ సోమేశ్ కుమార్‌, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జూడాల పట్ల ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదని సీఎం అన్నారు. సమయం, సందర్భం చూడకుండా సమ్మెకు దిగడం సరికాదని చెప్పారు. కరోనా వేళ సమ్మె చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు.

న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్‌ చెప్పారు. రాష్ట్రంలోని జూనియర్‌ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీనియర్‌ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం 15 శాతం పెంచాలని ఆయన నిర్ణయించారు. మూడేళ్ల వైద్య విద్యతో కొవిడ్‌ విధుల్లో ఉన్న వారికి గౌరవ వేతనం పెంచాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆయన ఆదేశించారు.

పెంచిన స్టయిఫండ్‌, ప్రోత్సాహకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జూడాలు సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. వారి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.