WorldWonders

మోసం ఫోర్జరీ కేసులో గాంధీ మునిమనవరాలైకి ఏడేళ్ల జైలు

మోసం ఫోర్జరీ కేసులో గాంధీ మునిమనవరాలైకి ఏడేళ్ల జైలు

భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్‌ లతా రాంగోబిన్‌ దక్షిణాఫ్రికాలో మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..

గాంధీజీ మనవరాలైన దక్షిణాఫ్రికాలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త ఈలా గాంధీ కుమార్తె లతా రాంగోబిన్‌.. అహింసపై ఏర్పాటైన ఓ ఎన్జీవోలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ హక్కుల కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. కాగా.. 2015లో భారత్‌ నుంచి లినెన్‌ వస్త్రాలతో ఉన్న కంటైనర్లు తెప్పిస్తున్నానంటూ ఓ వ్యాపారిని నకిలీ పత్రాలతో మోసం చేసినట్లు ఆమెపై కేసు నమోదైంది.

దక్షిణాఫ్రికాకు చెందిన న్యూ ఆఫ్రికా అలియన్స్‌ ఫూట్‌వేర్‌ డిస్ట్రిబ్యూటర్‌ స్థానికంగా వస్త్రాలు, చెప్పుల వ్యాపారం చేస్తుంటుంది. అంతేగాక, ప్రాఫిట్‌- షేర్‌ ఒప్పందం కింద ఇతర కంపెనీలకు రుణాలు కూడా ఇస్తుంది. ఈ కంపెనీ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌ మహరాజ్‌ను 2015 ఆగస్టులో లతా రాంగోబిన్‌ కలిశారు. దక్షిణాఫ్రికా హాస్పిటల్‌ గ్రూప్‌ నెట్‌కేర్‌ కోసం తాను భారత్‌ నుంచి మూడు లినెన్‌ కంటైనర్లను దిగుమతి చేసుకున్నానని, అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్‌ సుంకాలు చెల్లించలేకపోతున్నానని తెలిపారు. హార్బర్‌లో ఉన్న కంటైనర్లను తెచ్చుకునేందుకు తనకు కొంత డబ్బు సాయం కావాలని అడిగారు. ఇందుకుగానూ.. తన లాభాల్లో షేర్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. లినెన్‌ ఉత్పత్తులను ఆర్డర్‌ చేసినట్లుగా కొన్ని పత్రాలు, ఇన్‌వాయిస్‌లు ప్రూఫ్‌లుగా చూపించారు.

లతా రాంగోబిన్‌ కుటుంబ పరపతి, ఆ ప్రతాలను చూసిన మహరాజ్‌ ఆమెతో ఒప్పందం చేసుకుని 6.2మిలియన్‌ రాండ్ల నగదు ఇచ్చారు. అయితే కొన్ని రోజులకే ఆమె చూపించిన పత్రాలు నకిలీవని, భారత్‌ నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోలేదని మహరాజ్‌కు తెలిసింది. దీంతో ఆయన లతా రాంగోబిన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2015లోనే ఈ కేసు విచారణ ప్రారంభం కాగా.. ఆమె బెయిల్‌పై బయటకొచ్చారు. సోమవారం తుది విచారణ జరిపిన డర్బన్‌ న్యాయస్థానం ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ 7ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు, శిక్షపై అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదని కోర్టు తేల్చి చెప్పింది.