DailyDose

విజయవాడలో ₹6కోట్ల మోసం-నేరవార్తలు

MK Developers 6Crore Scam In Vijayawada

* జేపీ గ్రూప్‌ ఇసుక రీచ్‌ల ఫోర్జరీ కేసులో తీగలాగే కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది. నిందితుడు చంద్రశేఖర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఎమ్మెల్సీలు ఇప్పిస్తానంటూ రూ.కోటి వసూలు చేసినట్లు సమాచారం.

* జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం సోపోర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) క్యాంప్‌పై గ్రనేడ్‌తో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఎల్‌ఈటీ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

* పీఎన్‌బీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీకి భారీ షాక్‌ తగిలింది. క్యూబాకు పారిపోతూ డొమినికాలో అరెస్ట్‌ అయిన చోక్సీకి డొమినికా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చోక్సీ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్లైట్ రిస్క్ కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అక్కడి న్యాయమూర్తి వైనెట్ అడ్రియన్ రాబర్ట్స్ స్పష్టం చేశారు. అలాగే చోక్సీపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు కూడా ఉందని న్యాయవాది లారెన్స్ వాదించారు.

* బెజవాడకు చెందిన నిర్మాణ రంగ సంస్థ ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ బోర్డు తిప్పేసింది. కొనుగోలుదారుల నుంచి సుమారు రూ.6కోట్ల వరకు అడ్వాన్సులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా మూసేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు గతేడాది ఆగస్టులో విజయవాడ కేంద్రంగా ఎంకే కనస్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. గురునానక్‌ కాలనీలోని మహానాడులో కార్యాలయాన్ని తెరిచారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోనూ ఒక బ్రాంచిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామానికి చెందిన ఉప్పు మనోజ్‌కుమార్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. యద్దనపూడికి చెందిన బలగం రవితేజ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థ అభివృద్ధి చేసే స్థలాలు, నిర్మించే గేటెడ్‌ కమ్యూనిటీల్లో విల్లాలు విక్రయించడానికి విజయవాడలోని మొత్తం 20 మంది యువకులను ఏజెంట్లుగా నియమించుకున్నారు. విక్రయించిన ప్లాట్లలో వారికి రెండు శాతం కమీషన్‌ ఇస్తామని నమ్మించారు. పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్‌, రవితేజ, కలిసి ఈ ఏజెంట్లకు విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం, ముస్తాబాద్‌, ఆగిరిపల్లిలో ఉన్న స్థలాలను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు వెంచర్లను ఏజెంట్లకు చూపించారు. ఈ స్థలాలను చూసిన ఏజెంట్లు బుకింగ్స్‌ తీసుకొచ్చారు. కొంత మంది ఏజెంట్లు ముందుగా పెట్టుబడి పెట్టి అడ్వాన్సులు ఇచ్చారు. భారీగా ఆఫర్లు ప్రకటించడంతో పలువురు కస్టమర్లు అడ్వాన్సులు చెల్లించారు. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖపట్నానికి చెందిన సుమారు 100 మంది లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఏజెంట్ల ద్వారా బుకింగ్స్‌ చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్ల కోసం పట్టుబట్టారు. శ్రీనివాసరావు, మనోజ్‌, రవితేజపై ఏజెంట్లు ఒత్తిడి తెచ్చారు. దీంతో మార్చి నుంచి సంస్థ నిర్వాహకులు కార్యాలయానికి రాకపోకలు తగ్గించారు. ముగ్గురూ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.