* అమర రాజ బ్యాటరీస్ బోర్డు తమ నాయకత్వ మరియు సంస్థాగత మార్పులను ప్రకటించింది. 36 సంవత్సరాలు కంపెనీని నడిపించిన వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రామచంద్ర గల్లా ఆ పదవిలో కొనసాగే ఆలోచన లేదని బోర్డుకు వెల్లడించగా బోర్డు ఆమోదించింది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) ముగిసే వరకు ఆయన డైరెక్టర్, ఛైర్మన్గా కొనసాగుతారు. వైస్ చైర్మన్ జయదేవ్ గల్లా AGM తరువాత బోర్డు ఛైర్మన్ పదవిని చేపట్టనున్నారు.
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎమ్, బ్యాంకు బ్రాంచ్లు ద్వారా చేసే నగదు విత్డ్రాలపై సేవా రుసములను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ కొత్త ఛార్జీలు చెక్బుక్, నగదు బదిలీ, ఇతర ఆర్థికేతర లావాదేవీలకు వర్తిస్తాయి. పునరుద్ధరించిన కొత్త సేవా రుసములు జులై1,2021 నుంచి అమలులోకి వస్తాయని, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్బీడి) ఖాతాదారులకు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది. జీరో బ్యాలెన్స్ ఖాతాగా ప్రసిద్ధి చెందిన ఎస్బీఐ బీఎస్బీడీ ఖాతా సమాజంలోని పేద వర్గాలను ఉద్దేశించింది. రెగ్యులర్ పొదుపు ఖాతాకు వర్తించే వడ్డీ రేట్లే జిరో బ్యాలెన్స్ ఖాతాకు వర్తిస్తాయి. ఒక నెలలో బ్యాంక్ బ్రాంచ్లు, ఏటీఎమ్ వద్ద కలిపి నాలుగు ఉచిత నగదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అంతకు మించి చేసే నగదు ఉపసంహరణలపై రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్/ ఏటీఎమ్ వద్ద పరిమితికి మంచి చేసే ఒక్కో కొత్త నగదు విత్డ్రా లావాదేవీకి రూ.15+జీఎస్టీ వసూలు చేస్తారు. ఈ విత్డ్రాలు హోమ్ బ్రాంచ్ వద్ద చేసినా, నాన్ ఎస్బీఐ ఎటీఎమ్ వద్ద చేసినా ఛార్జీలు వర్తిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో బీఎస్బీడి ఖాతాదారులకు 10 చెక్ లీవ్స్ను ఉచితంగా ఇస్తుంది ఎస్బీఐ. ఆ తరువాత అందించే చెక్కులకు నిర్థిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంది. 10 లీవ్స్తో ఉన్న చెక్బుక్కి రూ.40+జీఎస్టీ. 25 లీవ్స్తో ఉన్న చెక్బుక్కి రూ.75+జీఎస్టీ. అత్యవసర చెక్ బుక్ ..10 లీవ్స్ లేదా అందులో కొంత భాగం ఉన్న చెక్బుక్కి రూ.50+జీఎస్టీ. అయితే, ఈ కొత్త చెక్బుక్ సర్వీస్ ఛార్జీల నుంచి సీనియర్ సిటిజన్లు మినహాయించారు. ఎస్బీఐ, ఎస్బీఐయేతర బ్యాంక్ శాఖలలో బీఎస్బీడి ఖాతాదారులకు సంబంధించిన ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి రుసములు వర్తించవు. ఈ ఖాతాదారులకు బ్రాంచ్లు, ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే ట్రాన్స్ఫర్ లావాదేవీలు కూడా ఉచితం. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో నాన్-హోమ్ బ్రాంచ్ల వద్ద చెక్ లేదా క్యాష్ విత్డ్రా ఫారమ్లను ఉపయోగించి చేసే నగదు ఉపసంహరణ పరిమితిని ఎస్బీఐ పెంచింది. వినియోగదారులకు మద్దతు నిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ చెక్ ఉపయోగించి స్వయంగా చేసే నగదు ఉపసంహరణ రోజువారి పరిమితిని రూ.1 లక్షకు పెంచింది. విత్డ్రా ఫారం, బ్యాంకు పొదుపు ఖాతా పాస్బుక్ ద్వారా చేసే నగదు ఉపసంహరణ రోజువారి పరిమితిని రూ.25 వేలకు పెంచింది. థర్డ్ పార్టీ క్యాష్ విత్డ్రాలను నెలకు రూ.50వేలకు పరిమితం చేసింది. ఇవి చెక్ను ఉపయోగించి మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ సవరించిన ఛార్జీలు సెప్టెంబరు 30,2021 వరకు అమలులో ఉంటాయి.
* గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత శుక్రవారం రూ.441 మేర పెరిగిన బంగారం ధర సోమవారం అదేస్థాయిలో తగ్గింది. దేశ రాజధాని నగరం దిల్లీలో రూ.464లు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,705కి చేరింది. క్రితం ట్రేడింగ్లో 10గ్రాముల బంగారం ధర రూ.48,169గా ఉంది.