Politics

స్పీకర్‌తో రఘురామ…గవర్నర్‌తో జగన్ భేటీ-తాజావార్తలు

స్పీకర్‌తో రఘురామ…గవర్నర్‌తో జగన్ భేటీ-తాజావార్తలు

* స్పీకర్‌ ఓంబిర్లాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌తో సహా తనపై దాడి చేసిన అధికారులందరిపై త్వరితగతిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తన పేరును తొలగించిన విషయాన్ని స్పీకర్‌ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. 48 గంటల్లో తన పేరును వెబ్‌సైట్‌లో చేర్చకపోతే.. మరోసారి కలిసేందుకు స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. తన దిష్టిబొమ్మలను అధికార పార్టీ నేతలు తగులబెడుతున్నారని స్పీకర్‌ దృష్టికి రఘరామ తెచ్చారు.

* గవర్నర్ తో ముగిసిన సీఎం జగన్ భేటీ…దాదాపు 45 నిమిషాలు పాటు కొనసాగిన భేటీ..MLC అభ్యర్థుల ఫైల్ కు ఆమోదం తెలపాలని గవర్నర్ ను కోరిన సీఎం జగన్..రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్ కు వివరించిన ముఖ్యమంత్రి…ఇరువురి మధ్య చర్చకు వచ్చిన పలు అంశాలు.

* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎంపికపై అసంతృప్తి చెలరేగుతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యవహార శైలిపై భయంతో వైసీపీ నేతలు, ఎమ్మెల్సీ ఆశావహులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేయడానికి, అసమ్మతిని తెలియపరచడానికి సాహసం చేయనప్పటికీ పరోక్షంగా చెక్ పెట్టే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, గుంటూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అభ్యర్థిత్వాలపై వైసీపీ వర్గాల నుండే గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో గవర్నర్ ఎమ్మెల్సీలు జాబితాను పెండింగులో పెట్టారని సమాచారం.

* అశోక్ గజపతి రాజు రిట్ పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు.ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.72ను కొట్టివేసిన హైకోర్టు.సింహాచలమ వారహలక్ష్మీ నరసింహ దేవస్థానానికి, మానస ట్రస్ట్ కు ఆయనే చైర్మన్ గా ఉండేలా ఆదేశాలు.హైకోర్టు ఆదేశాలతో మానస ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికీ తిరిగి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతి రాజు.

* వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పల్లా అండ్ కో ఆక్రమించుకున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు.

* బిజేపి లో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్

? తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో 1.10లక్షలకు పైగా టెస్ట్‌లు చేయగా 1511 కొత్త కేసులు నమోదయ్యాయి. , 12 మంది మృతిచెందగా.. 2175మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.36శాతంగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు, ఏపీలో నిన్న 87,756 శాంపిల్స్‌ పరీక్షించగా.. 4549 కేసులు నమోదయ్యాయి. 59 మంది మృతిచెందగా.. 10,114 మంది కోలుకున్నారు.

? రద్దీగా ఉన్న ప్రాంతంలో కొవిడ్‌-19 సోకిన వ్యక్తిని అక్కడికక్కడే పసిగట్టే ఒక సాధనాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సదరు వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను ఇది విశ్లేషించి, ఈ నిర్ధారణ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్‌ సాధనానికి ‘కొవిడ్‌ అలారం’ అని పేరు పెట్టారు. కరోనా బాధితుల నుంచి ఒకింత విభన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు.

? రాష్ట్రంలో రోజుకు 2లక్షల మందికి వ్యాక్సినేషన్‌ జరుగుతోందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 80లక్షల డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు. జ్వర సర్వే మూడు రౌండ్లు పూర్తయిందని, దీని ద్వారా 4లక్షలకు పైగా కిట్లు పంపిణీ చేసినట్టు మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. ఇంటింటి సర్వే కొనసాగిస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9.25లక్షల డోసుల టీకా నిల్వ ఉన్నట్టు తెలిపారు.

? ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పిలవబడే మహారాష్ట్ర ముంబయిలోని ధారవి ప్రాంతంలో తొలిసారి సున్నా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ధారవిలో 6841 కేసులు రాగా.. ప్రస్తుతం అక్కడ 13 క్రియాశీల కేసులు ఉన్నాయి.

? బెంగాల్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం జులై 1వరకు పొడిగించింది. అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు 25శాతం సామర్థ్యంతో పనిచేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు సీఎం మమతాబెనర్జీ తెలిపారు. అలాగే, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు 25శాతం సామర్థ్యం మించకుండా కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతిచ్చింది.

? భారత్‌లో చిన్నారుల కోసం అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఊపందుకున్నాయి. పిల్లల కోసం భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 12 నుంచి 18ఏళ్ల వారిపై ప్రయోగాలు పూర్తికాగా.. తాజాగా 6నుంచి 12ఏళ్ల చిన్నారులపై మంగళవారం నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు దిల్లీ ఎయిమ్స్‌లో ఏర్పాట్లు చేశారు.

? కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16నుంచి దేశవ్యాప్తంగా మ్యూజియాలు, చారిత్రక ప్రదేశాలు, కట్టడాలకు సందర్శకులను అనుమతించనున్నట్టు ప్రకటించింది. సందర్శకులు ఆన్‌లైన్‌ ద్వారానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది.

? కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన నొవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన టీకా 90శాతం సమర్థతతో పనిచేస్తోందని మూడో దశ ఫలితాల్లో వెల్లడించింది. ఇది కొత్త వేరియంట్లను అడ్డుకోవడంలోనూ సమర్థంగా పనిచేస్తుందని ఆ సంస్థ తెలిపింది. అమెరికాతో పాటు మెక్సికోలో దాదాపు 30వేల మందిపై జరిపిన ప్రయోగ్రాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఈ ఫలితాలు వెల్లడించింది. ప్రపంచ దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోన్న తరుణంలో నొవావాక్స్‌ అందుబాటులోకి రానుండడం ఊరట కలిగించే విషయం. మరోవైపు, ఈ వ్యాక్సిన్‌ తయారీని భారత్‌లో చేపట్టేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

? కరోనాతో శ్వాస సంబంధమైన సమస్యలు ఎదుర్కొనే వారి కోసం ‘పాకెట్‌ వెంటిలేటర్‌’ని తయారుచేశారు కోల్‌కతాకు చెందిన రామేంద్ర లాల్‌ముఖర్జీ అనే ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్‌. దీని సాయంతో పూర్తిస్థాయి వైద్యం అందేలోపు రోగి ప్రాణాలను నిలబెట్టుకోవచ్చంటున్నారు. కొన్ని రోజుల క్రితం కొవిడ్‌బారిన పడిన ఆయన.. తీవ్రమైన శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తాను అనుభవించిన బాధలు ఇంకెవరూ పడకూడదన్న సంకల్పంతో తనకున్న పరిజ్ఞానంతో ‘పాకెట్‌ వెంటిలేటర్‌’నుతయారు చేశారు.

? దేశంలో కరోనా వైరస్‌ అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు మరి కాస్త తగ్గాయి. 74 రోజుల తర్వాత భారీ స్థాయిలో తగ్గి 70,421 కేసులు రికార్డయ్యాయి. వరుసగా 32వ రోజు కూడా కొత్త కేసుల కన్నా రికవరీలే భారీగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.72శాతానికి తగ్గగా.. 66 రోజుల తర్వాత తొలిసారి క్రియాశీల కేసుల సంఖ్య 10లక్షల కన్నాదిగువకు చేరింది. అలాగే, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రాలకు ఇప్పటివరకు 26,68,36,620 డోసులు పంపిణీ చేయగా.. ఈ ఉదయం 8గంటలవరకు 25,27,66,396 డోసుల పంపిణీ జరిగినట్టు కేంద్రం సోమవారం వెల్లడించింది. ఇంకా రాష్ట్రాల వద్ద 1,40,70,224 డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మూడు రోజుల్లో మరో 96,490 డోసులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఆదివారం 14.9లక్షల డోసులు పంపిణీ చేశారు.