Movies

ప్రియుడి ₹175కోట్ల బంగ్లాలోకి జాక్వెలిన్

ప్రియుడి ₹175కోట్ల బంగ్లాలోకి జాక్వెలిన్

శ్రీలంక నుంచి భారత్‌కు వచ్చి బీటౌన్‌లో బ్యూటీ క్వీన్‌గా రాణిస్తున్నారు నటి జాక్వెలిన్‌ పెర్నాండేజ్‌. తన నటన, అందచందాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. తరచూ షూటింగ్స్‌, ఫ్యాషన్‌ షోలతో బిజీగా ఉండే ఈ భామ.. ప్రస్తుతం కుటుంబానికి దూరంగా ముంబయిలోనే ఓ ఖరీదైన ఇంటిని తీసుకుని అక్కడే ఉంటున్నారు. కాగా, జాక్వెలిన్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం ప్రతిఒక్కర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రియుడితో ఎక్కువ సమయాన్ని గడపాలని ఈ బ్యూటీ భావిస్తున్నారట. దీంతో, ఈమె త్వరలోనే సుమారు రూ.175 కోట్లు ఖరీదు చేసే ఇంట్లోకి మకాం మార్చనున్నారట. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో జాక్వెలిన్‌ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారట. బిజినెస్‌ వ్యవహారాల రీత్యా భవిష్యత్తులో ముంబయిలోనే సెటిలవ్వాలని జాక్వెలిన్‌ ప్రియుడు భావిస్తున్నారట. ఇక, జాక్వెలిన్‌ సైతం తన ప్రియుడితో కలిసి ఉండాలనుకుంటున్నారట. దీంతో ఈ జంట ఇటీవల ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే జుహూలోని ఓ అందమైన కాలనీలో రూ.175 కోట్లు పెట్టి బంగ్లా కొనుగోలు చేశారట. తమ అభిరుచులకు తగ్గట్టు దాన్ని డిజైన్‌ చేసే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే త్వరలో జాక్వెలిన్‌ ఆ బంగ్లాలోకి మకాం మార్చే అవకాశాలున్నాయంటూ బీటౌన్‌లో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త విన్న ప్రతిఒక్కరూ.. ‘వామ్మో’ ఇంత ఖరీదైన బంగ్లానా అని చెప్పుకుంటున్నారు. మరోవైపు.. జాక్వెలిన్‌ ఇటీవల ‘పానీ పానీ’ స్పెషల్‌ ఆల్బమ్‌తో నెటిజన్లను ఎంతగానో ఆకర్షించారు.