Politics

గాంధీభవన్‌కు భారీ వాస్తు మార్పులు

గాంధీభవన్‌కు భారీ వాస్తు మార్పులు

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించిన నేపథ్యంలో, గాంధీ భవన్ లో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా, వాస్తు సిద్ధాంతం ప్రకారం ఈ కొత్త మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీని ప్రకారం… గాంధీభవన్ లో కాంగ్రెస్ పతాకాలు విక్రయించే గదితో పాటు, భద్రతా సిబ్బంది గదిని కూడా తొలగించనున్నారు. ఈశాన్యం వైపున ఖాళీగా ఉంచాలన్నది కొత్త పీసీసీ నేతల ఆలోచన! అంతేకాదు, ఆవరణలో గాంధీ విగ్రహం మినహా మరే నిర్మాణాలు ఉండరాదని నేతలు భావిస్తున్నారు. రేవంత్ పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో పాత గేటు నుంచి వచ్చి, కార్యక్రమం అనంతరం కొత్త గేటు ద్వారా బయటికి వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, రేవంత్ రెడ్డి జులై 7న గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్నారు. ఈ లోపే మార్పులు పూర్తిచేయనున్నారు. ఇప్పటికే కొందరు వాస్తు నిపుణులు గాంధీభవన్ ను పరిశీలించగా, వారి సూచనల మేరకే తాజా మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.