ScienceAndTech

సరిహద్దుల్లో పహారాకు భారత మహిళా సైనికులు

మహిళా ప్రయాణికులను తనిఖీ చేసేందుకు జమ్ముకశ్మీర్‌లోని​ గందర్బల్‌ జిల్లాలో అసోం రైఫిల్స్​కు చెందిన​ మహిళా సైనికులను మోహరించారు. వీరు జాతీయ రహదారుల్లోని చెక్​ పాయింట్ల వద్ద వాహనాలను తనిఖీ చేయనున్నట్లు కల్నల్ కరకోటి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నివాసితులతో మమేకమవుతూ.. భద్రతా సిబ్బందికి, ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ బలగాలు పనిచేస్తారని కల్నల్‌ వెల్లడించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మహిళలు అక్రమంగా చేరవేస్తున్నారనే సమాచారం మేరకు మహిళా జవాన్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారుల్లోని చెక్​ పాయింట్ల వద్ద తమ సహచరులకు స్థానిక మహిళలు సహకరిస్తున్నారని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్​లోని కుప్వారా జిల్లాలో 2020 ఆగస్టులోనే మహిళా బలగాలను మోహరించారు. ప్రస్తుతం గందర్బల్‌ జిల్లాలో మహిళా బలగాలు.. మహిళలను తనిఖీలు చేస్తున్నాయి. పురుష సైనికుల మాదిరే మహిళా సైనికుల సేవలను వినియోగించుకుంటున్నట్లు కల్నల్ కరకోటి తెలిపారు. స్థానిక ప్రజలతో కలిసిపోయి వారిలో చైతన్యం కలిగించే దిశగా మహిళా సేనలు పనిచేస్తాయన్నారు. భద్రతా దళాలకు ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.