Business

ఈ నెలలోనే LIC IPO-వాణిజ్యం

ఈ నెలలోనే LIC IPO-వాణిజ్యం

* ఎల్‌ఐసీ ఐపీవోకు సంబంధించి ఈ నెలలో కీలక ముందడుగు పడనుంది. ఈ ఐపీవోకు సంబంధించిన మర్చెంట్‌ బ్యాంకర్లను ఎంపిక చేసేందుకు జులైలో ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించనుంది. జనవరి నాటికి ఎల్‌ఐసీని ఐపీవోకు తీసుకురావాలనే ప్రణాళికతో పనిచేస్తోంది. ఇప్పటికే జనవరిలో ఎల్‌ఐసీ విలువను మదింపు చేసేందుకు ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ జనవరిలో ‘మిల్లిమ్యాన్‌ అడ్వైజర్స్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియా’ను నియమించింది. భారత కార్పొరేట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఐపీవోగా భావిస్తున్నారు. దీంతోపాటు ఎల్‌ఐసీ విక్రయానికి అవసరమైన బడ్జెట్‌ సవరణలను ఇప్పటికే నోటిఫై చేశారు.‘‘రానున్న వారాల్లో మేము మర్చెంట్‌ బ్యాంకర్ల నియామకం కోసం బిడ్లను ఆహ్వానించనున్నాము. ఇప్పటికే సంస్థాగత మదుపరులతో చర్చలు జరుగుతున్నాయి. నవంబర్‌ చివరి నాటికి రెగ్యూలేటరీల అనుమతులు లభిస్తాయని భావిస్తున్నాం’’ అధికారులు చెబుతున్నారు. ఈ ఐపీవోలో దాదాపు 10శాతం వాటాలను పాలసీదార్ల కోసం రిజర్వు చేశారు.ఎల్‌ఐసీ అమెండ్‌మెంట్‌ చట్టాన్ని ఆర్థిక చట్టంలో భాగంగా చేశారు. ఆ తర్వాత ఐపీవోకు అవసరమైన చట్టపరమైన సవరణలు చేస్తున్నారు. డెలాయిట్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ను ఐపీవో లావాదేవీల సలహాదారులుగా నియమించారు. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరడానికి ఎల్‌ఐసీ లిస్టింగ్‌ చాలా కీలకమైంది. ఈ ఏడాది వాటాల విక్రయం ద్వారా రూ.1.75లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది.

* భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం ప్రయత్నాలు ప్రారంభించిన ప్రభుత్వం, అందుకోసం తగిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. ఇందుకు వీలుగా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ నిబంధనలు-1956కు కొన్ని మార్పులు చేస్తూ, జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్‌ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించనుంది. దీంతోపాటు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించింది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్లకు బదులుగా 62 ఏళ్లకు పెంచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లే. ఎస్‌బీఐలోనూ ఇదే నిబంధన ఉంది. ఇకపై ఛైర్మన్‌ను నియమించేటప్పుడు ప్రభుత్వం ఇచ్చిన వ్యవధి, 62 ఏళ్ల వయసు ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పుడు ఎల్‌ఐసీ ఛైర్మన్‌ పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ ఐపీఓకి వస్తున్న నేపథ్యంలో సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ పదవీకాలాన్ని ప్రభుత్వం తొమ్మిది నెలలు పొడిగించింది. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

* పెట్రోలు ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు చమురు విక్రయ సంస్థలు మూడుసార్లు ధరలు పెంచాయి. తాజాగా ఆదివారం లీటరు పెట్రోలుపై రూ.36 పైసలు, లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.103.41; డీజిల్‌ రూ.97.40కు చేరుకుంది. తిరుపతి, విజయవాడలలో డీజిల్‌ ధరలు సెంచరీకి చేరువవుతున్నాయి. ఈ ఏడాది మే 4 నుంచి పెట్రోల పెరుగుదల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 35 సార్లు పెట్రోలు ధరలు పెరిగాయి. మొత్తంగా రెండు నెలల కాలంలో లీటరు పెట్రోలుపై రూ.9.12 పెరిగింది. ఇదే సమయంలో డీజిల్‌ ధర లీటరుకు రూ. 8.71 ఎగబాకింది.

* హాల్‌మార్కింగ్‌ కలిగిన బంగారు ఆభరణాలు మాత్రమే తప్పనిసరిగా విక్రయించాలనే నిబంధన జూన్‌ 15 నుంచి దేశీయంగా అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ కేంద్రాలు లేనందున, దశలవారీగా ఈ నిబంధన అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నిబంధన అమలుపై ప్రభుత్వం, వ్యాపారుల సంఘాలతో నిర్వహించిన చర్చల్లో అంగీకారానికి వచ్చిన కీలక అంశాలు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్‌) వెబ్‌సైట్‌లో కనిపించకపోవడంతో ఆభరణాల వ్యాపారుల్లో సందేహాలు నెలకొన్నాయని ఆలిండియా జెమ్‌ అండ్‌ జువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (జీజేసీ) శనివారం పేర్కొంది. ఆయా అంశాలపై స్పష్టత ఇస్తూ, బీఐఎస్‌ వెబ్‌సైట్‌లో పొందుపరచి, గందరగోళానికి తెరదించాలని అభ్యర్థిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూశ్‌ గోయెల్‌కు లేఖ రాసినట్లు జీజేసీ ఛైర్మన్‌ ఆశిష్‌ పెథె తెలిపారు.