Politics

కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేస్తే మేము కూడా కలుస్తాం

కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేస్తే మేము కూడా కలుస్తాం

కృష్ణా జలాల హక్కుల సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ దీక్షకు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఒప్పించి మద్దతు ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్‌ సమస్యను వివాదాస్పదం చేసి, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన నీళ్లను అడ్డం పెట్టుకుని తెలంగాణ, రాయలసీమ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ గెస్ట్‌హౌస్‌కు పరిమితం కాక తప్పదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మారిన వారికి చెప్పుల దండలు వేసి ఉరికించి కొడతామని వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు సరికొత్త యుద్ధానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయాన్ని రేవంత్‌ సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, గడ్డం వినోద్‌, ఎంఏఖాన్‌, ఎం.కోదండరెడ్డి, పి.విష్ణువర్దన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌లను కలిశారు. ఆ సందర్భాల్లోనూ.. తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. ఈనెల 9వ తేదీన కేఆర్‌ఎంబీ (కృష్ణా నదీ యాజమాన్య బోర్డు) సమావేశ తేదీని నిర్ణయిస్తే దీన్ని 20వ తేదీకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోరుతోందని రేవంత్‌ ప్రశ్నించారు. సీఎం బిజీగా ఉంటే ప్రతినిధిగా మాజీ నీటిపారుదలశాఖ మంత్రులు కడియం శ్రీహరి లేదా తుమ్మల నాగేశ్వరరావుని పంపవచ్చు కదా? అని అన్నారు. ఆరోజు సమావేశం ముందు తెలంగాణ ప్రజల హక్కులపై వాదించకుంటే సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌ను కుటుంబ పెద్దగానే ఏపీ సీఎం జగన్‌ చూడాలని అన్నారు. ఇక్కడ షర్మిల పార్టీ పెట్టడానికి, కేసీఆర్‌ జలాల అంశంపై రెచ్చగొట్టడానికి, తెలంగాణపై జగన్‌ ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని రేవంత్‌ ఆరోపించారు. తెలంగాణలో ఉద్యమ ద్రోహులే రాష్ట్రాన్ని ఏలుతున్నారని ఎంపీ ఎ.రేవంత్‌ ఆరోపించారు. ఎర్రబెల్లి, తలసాని, గంగుల, సబితా, పోచారం తదితరులే పాలిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ఇస్తే, ఇప్పుడు పార్టీ మారి కాంగ్రెస్‌లో ఏముందంటున్నారని దానం నాగేందర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘మేం రాళ్లతో కొడతాం.. అంటే ఎవరో చెప్పులతో కొడతామన్నారు.. అలాంటి వారినందరినీ 7వ తేదీ తర్వాత చెప్పుల దండలు వేసి మరీ ఉరికించి కొడతాం’’ అని రేవంత్‌ హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందచేసి రేవంత్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం నిజాయతీగా పోరాడిన మహానాయకుడు పి.జనార్దన్‌రెడ్డి అని ఆయన తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డిని కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారు.