Business

ఫ్రాన్స్‌లో భారత ప్రభుత్వ ఆస్తులు జప్తు-వాణిజ్యం

ఫ్రాన్స్‌లో భారత ప్రభుత్వ ఆస్తులు జప్తు-వాణిజ్యం

* కెయిర్న్‌ ఎనర్జీ రెట్రోస్పెక్టివ్‌(పాత తేదీల నుంచి విధించే) పన్ను వివాదం కేసులో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాల ప్రకారం డబ్బు చెల్లించనందుకు గానూ.. ఫ్రాన్స్‌లోని భారత ప్రభుత్వ ఆస్తుల జప్తుకు అవసరమైన న్యాయప్రక్రియను బుధవారం పూర్తి చేసినట్లు పీటీఐ పేర్కొంది. ఫ్రెంచ్‌ కోర్టు అనుమతుల మేరకు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు కూడా వెల్లడించాయి. భారత ప్రభుత్వ ఆస్తుల యాజమాన్య హక్కులను కెయిర్న్‌ ఎనర్జీ తీసుకునేందుకు ఫ్రెంచ్‌ కోర్టు జూన్‌ 11నే ఉత్తర్వులు జారీ చేసిందని, అందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ బుధవారంతో ముగిసిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. పారిస్‌లో భారత ప్రభుత్వానికి చెందిన దాదాపు 20 ఆస్తులను కంపెనీ జప్తు చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ 20 మిలియన్‌ యూరోలకు పైనే ఉంటుందట. భారత ప్రభుత్వం పెట్టుబడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ గతేడాది డిసెంబర్‌లో ఆర్బిట్రేషన్‌ న్యాయస్థానం కెయిర్న్‌ ఎనర్జీకి అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి 1.2 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని భారత్‌ను ఆదేశించింది. అయితే, ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం ఇంకా చెల్లించకపోవడంతో సొమ్ము రాబట్టుకోవడం కోసం కెయిర్న్‌ ఎనర్జీ పలు దేశాల్లోని న్యాయస్థానాలను ఆశ్రయించింది. అమెరికా, యూకే, నెదర్లాండ్స్‌, కెనడా, ఫ్రాన్స్‌, సింగపూర్‌, జపాన్‌, యూఏఈ తదితర దేశాల్లోని కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసింది. ఆయా దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను జప్తు చేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఫ్రెంచ్‌ కోర్టు నుంచి అనుమతులు రావడంతో అక్కడి భారత ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 2006లో కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం కెయిర్న్‌‌ ఎనర్జీకి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదిలా ఉండగా.. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్‌‌ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు. దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ను నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది. దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌(అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు)ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ద్వైపాక్షిక పెట్టుబడి పరిరక్షణ ఒప్పందాన్ని పన్ను నోటీసులు ఉల్లంఘించాయంటూ తీర్పునిచ్చింది. అలాగే నిలిపివేసిన డివిడెంట్లు, ట్యాక్స్ రీఫండ్‌, షేర్ల విక్రయం వల్ల వాటిల్లిన నష్టం నేపథ్యంలో తిరిగి భారత ప్రభుత్వమే కెయిర్న్‌‌ ఎనర్జీకి 1.2 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఆర్బిట్రేషన్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ భారత్‌ కూడా పిటిషన్‌ దాఖలు చేసింది.

* కేవలం రెండేళ్లలోనే ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బౌఫారాత్‌ తన ఆన్‌లైన్‌-సమావేశ వేదిక ‘హోపిన్‌’ను వేల కోట్ల కంపెనీగా తీర్చిదిద్దాడు. హోపిన్‌ ఆన్‌లైన్‌ ఈవెంట్లను, వర్చువల్‌ పద్ధతిలో నిర్వహిస్తుంది. ఈ కంపెనీని అతడు 2019లో, కేవలం ఆరుమందితో ప్రారంభించాడు. నేడు అతడి కంపెనీలో దాదాపు ఆరువందల మంది పని చేస్తున్నారు. కానీ అందులో కొంతమందిని అతడు ప్రత్యక్షంగా ఎప్పుడూ కలుసుకోలేదు. ఆ సంస్థ ఉద్యోగులు అందరూ కలసి ఒకే కప్పు కింద కూర్చుని పనిచేయరు. ఎందుకంటే ఆ కంపెనీకి సొంత ఆఫీసు భవనమే లేదు. తనకు పర్మినెంట్‌ ఆఫీసు లేదని, అదో కొరత అని తనెప్పుడూ ఆలోచించలేదంటాడు జానీ. అలాగే ఓ సాహసోపేతమైన యువ పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ శాశ్వత చిరునామా కూడా లేదని చెబుతాడు. తనొక డిజిటల్‌ దేశ సంచారినని పేర్కొంటాడు. తనెక్కడుంటే అక్కడికే తన కంపెనీని తీసుకెళ్లి, తన వ్యాపారాన్ని విస్తరించుకుంటానని గర్వంగా ప్రకటించాడు. అతను ఇటీవల సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో స్వయంకృషితో ఎదిగిన కోటీశ్వరుడిగా చోటు సంపాదించుకున్నాడు. అతను తన కంపెనీ విలువను 5.65 బిలియన్‌ డాలర్లకు పెంచాడు.

* ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా సేల్‌కు సిద్ధమైంది. ప్రతి ఏడాది మాదిరిగానే ‘ప్రైమ్‌ డే సేల్‌’ పేరిట ఈ నెల 26, 27 తేదీల్లో సేల్‌ నిర్వహించనుంది. వాస్తవానికి జూన్‌లో ఇది జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆలస్యమైంది. అలాగే, కొవిడ్‌ కారణంగా ఘోరంగా దెబ్బతిన్న చిరు వ్యాపారులు, చేనేత కార్మికులు, తయారీదారులకు చేయూతనిచ్చేందుకు ఈ సేల్‌ నిర్వహిస్తున్నట్లు అమెజాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

* దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడంతో సూచీలు నేల చూపులు చూశాయి. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 53వేల పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠాలను తాకిన ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. దీంతో సెన్సెక్స్‌ మళ్లీ 52,500 స్థాయికి చేరుకోగా.. నిఫ్టీ సైతం 15,750 దిగువన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.71గా ఉంది.