Politics

మోడీ క్యాబినెట్‌లో నేరచరితులు కోటీశ్వరులు

మోడీ క్యాబినెట్‌లో నేరచరితులు కోటీశ్వరులు

ప్రధాని మోదీ రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులే జరిగాయి. కొత్తగా 36 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో కేంద్రంలో మొత్తం మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. కాగా.. నూతన మంత్రిమండలిలో 42శాతం అంటే 33 మంది మంత్రులపై క్రిమినల్‌ కేసులున్నాయట. వీరిలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ లాంటి తీవ్రమైన నేర అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) తన నివేదికలో వెల్లడించింది.

ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్‌ ఈ నివేదిక రూపొందించింది. కాగా.. 2019లో తొలి మంత్రివర్గంలో 56 మంది మంత్రులుండగా వారిలో 39శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. అప్పటితో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరగడం గమనార్హం.

ఇక కొత్త మంత్రివర్గంలో 90శాతం అంటే 70 మంది మంత్రులు కోటీశ్వరులేనని ఏడీఆర్‌ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. పౌర విమానయానశాఖ నూతన మంత్రి జ్యోతిరాదిత్య సింధియానే అత్యంత సంపన్న మంత్రి. ఆయన ఆస్తుల విలువ రూ.379కోట్లకు పైనే. ఆ తర్వాత పీయూష్‌ గోయల్‌(రూ.95కోట్లు), నారాయణ్‌ రాణె(రూ.87కోట్లు), రాజీవ్‌ చంద్రశేఖర్‌(రూ.64కోట్లు) అత్యంత సంపన్న మంత్రుల జాబితాలో ఉన్నారు. కేంద్రంలో మొత్తం మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ. 16.24కోట్లుగా ఉంది.

కేబినెట్‌ మంత్రుల్లో అతి తక్కువ ఆస్తులు ఉన్న వ్యక్తి ప్రతిమా భౌమిక్‌. త్రిపురకు చెందిన ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 6లక్షలు. పశ్చిమబెంగాల్‌కు చెందిన జాన్‌ బార్లాకు రూ. 14లక్షలు, రాజస్థాన్‌కు చెందిన కైలాశ్‌ చౌదరీకి రూ. 24లక్షలు, ఒడిశాకు చెందిన బిశ్వేశ్వర్‌ తుడుకు రూ. 27లక్షలు, మహారాష్ట్ర నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న. మురళీధరన్‌కు రూ. 27లక్షల ఆస్తులున్నట్లు ఏడీఆర్‌ నివేదిక తెలిపింది.

కొత్త మంత్రుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులే. 21 మంది మంత్రులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా.. 9 మంది మంత్రులు డాక్టరేట్‌ అందుకున్నారు. ఇక 17 మంది గ్రాడ్యుయేషన్‌, మరో 17 మంది ప్రొఫెషనల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ముగ్గురు మంత్రులు పదో తరగతి పూర్తిచేయగా.. మరో ఇద్దరు మంత్రులు 8వ తరగతి, ఏడుగురు ఇంటర్‌ చదివినట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.