Politics

కాంగ్రెస్ గూటికి కొండా

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ విజ్ఞప్తి చేశారు. రేవంత్ చర్చలు ఫలించాయి. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు విశ్వేశ్వర్ రెడ్డి గ్రీన్ సిగ్నలిచ్చారు. భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంచి కోసం పరితపిస్తుంటారని, ఆయనతో రాజకీయాల కంటే.. రాష్ట్రాభివృద్ధిపైనే చర్చించామని రేవంత్‌ తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని తప్పుబట్టారు. అప్పుల కోసం కేసీఆర్ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌లను అడిగితే పది పైసల వడ్డీకే వేల కోట్లు ఇస్తారని చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎప్పుడైనా రావొచ్చని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ రావడం సంతోషంగా ఉందని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయనతో తెలంగాణ అభివృద్ధిపైనే చర్చించామని చెప్పారు. కాంగ్రెస్‌ చేపట్టే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత విశ్వేశ్వరరెడ్డితో పలువురు నేతలు మంతనాలు జరిపారు. అయితే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరలేదు. విశ్వేశ్వరరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది.