Agriculture

నల్లగొండ రైతు. ఉంది ఎకరం. కబ్జా గుప్పిట అరెకరం.

నల్లగొండ రైతు. ఉంది ఎకరం. కబ్జాలో కాజేసింది అరెకరం.

తన భూమి ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని నకిరేకల్‌ తహసీల్‌ కార్యాయలం ఎదుట శుక్రవారం ఓగోడు గ్రామానికి చెందిన రైతు సోమయ్య నిరసన తెలిపారు. ప్రధాన కూడలి నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టి ఫ్లెక్సీతో కార్యాలయం ఎదుట భైఠాయించారు. ఓగోడు గ్రామంలోని 612/ఇ సర్వే నెంబరులో ఎకరం భూమిని 1977లో ప్రభుత్వం తనకు కేటాయిందని ఆయన వివరించారు. ఈ భూమికి సంబంధించి నాటి పట్టాదారు పాసుపుస్తకం, ధరణి ఇ-పాసుపుస్తకం కూడా తన పేరునే ఉన్నాయని, నాటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు. ఆలయం పేరు చెబుతూ అరెకరం భూమిని గ్రామానికి చెందిన కొందరు కబ్జాచేశారని, తనను సేద్యం చేయనివ్వడం లేదన్నారు. న్యాయం కోసం 2013 నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవిస్తున్నానని, ఉన్నత న్యాయస్థానంతోపాటు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించానని తెలిపారు. ఈ భూమిని సర్వేచేసి నివేదిక ఇవ్వాలని నాలుగు నెలల కిత్రం రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులకు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినా నేటికీ అమలు చేయడం లేదన్నారు. తన భూమిని కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ భూమిని సర్వే విభాగం ఏడీ స్థాయి అధికారి నేతృత్వంలో సర్వే చేయాల్సి ఉందని, సమస్యను జిల్లా అధికారులకు నివేదించామని నకిరేకల్‌ తహసీల్దారు పి.శ్రీనివాస్‌ తెలిపారు.