NRI-NRT

భారత ప్రయాణీకులపై ఎమిరేట్స్ నిషేధం పొడిగింపు

భారత ప్రయాణీకులపై ఎమిరేట్స్ నిషేధం పొడిగింపు

భారత్‌తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై దుబాయ్‌కు చెందిన విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నాలుగు దేశాల నుంచి వచ్చే ప్యాసెంజర్ విమాన సర్వీసులపై జూలై 28 వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని శుక్రవారం ఎమిరేట్స్ ప్రకటించింది. అలాగే గత 14 రోజులుగా ఈ దేశాల ద్వారా కనెక్ట్ అయిన ప్రయాణీకులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈకి ప్రయాణించడానికి వీల్లేదు. కాగా, యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యాధికారులు, కరోనా నేపథ్యంలో ప్రత్యేక అనుమతి ఉన్నవారికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంది. ఎమిరేట్స్‌తో పాటు ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ కూడా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై జూలై 31 వరకు సస్పెన్సన్ విధించినట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే.. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(జీసీఏఏ) మాత్రం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విమాన సర్వీసులపై విధించిన నిషేధం ఎప్పటివరకు కొనసాగుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.