Movies

కుంద్రా పోర్నోగ్రఫీ కేసు-మనోజ్ బాజ్‌పాయ్ ఒక నీచుడు-తాజావార్తలు

* నీలి చిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను అరెస్ట్‌ చేయడంపై కమెడియన్‌ సునీల్‌ పాల్‌ స్పందించాడు. పోర్నోగ్రఫీ రాకెట్‌ గుట్టు రట్టు చేయడమే కాక అతడిని అరెస్ట్‌ చేసినందుకు పోలీసులను అభినందించాడు. అయితే ఈ పోర్న్‌ అనేది రకరకాల రూపాల్లో విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడాడు. ‘రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేయడం సబబైనదే. ఇదిప్పుడు అవసరం కూడా! ఎందుకంటే పలుచోట్ల సెన్సార్‌ లేకపోవడంతో కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలు వెబ్‌సిరీస్‌లు తీస్తున్నారు. అవి ఇంట్లోవాళ్లతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మనోజ్‌ బాజ్‌పాయ్‌ను తీసుకుందాం. అతడు పెద్ద నటుడే కావచ్చు. కానీ అతడిలాంటి సభ్యత లేని వ్యక్తిని, నీచుడిని నేనింతవరకు చూడలేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అతడు ఫ్యామిలీ ఆడియన్స్‌ కోసం ఏం చేస్తున్నాడు? అతడు నటించిన ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌లో.. భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్‌, మైనర్‌ బాలికకు బాయ్‌ఫ్రెండ్‌, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది?

* వీథుల్లో భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలంగా పక్షపాత ధోరణిని తాను ప్రదర్శించలేనని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీథుల్లోకి వస్తున్నారని తెలిపింది. ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని పేర్కొంది. జస్టిస్  డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వీథుల్లో తిరిగి బిచ్చగాళ్ళకు, నిరాశ్రయులకు వ్యాక్సిన్లు వేయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ చిన్మయ్ శర్మను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, వీథుల్లోకి బిచ్చగాళ్ళు రాకుండా నిరోధించాలని మీరు కోరారని అన్నారు. వీథుల్లోకి వచ్చి ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నారని ప్రశ్నించారు. పేదరికం వల్ల వారు ఈ పని చేస్తున్నారన్నారు. అత్యున్నత న్యాయస్థానంగా తాము పక్షపాతంతో ఉన్నత వర్గాలకు అనుకూల దృక్పథాన్ని అనుసరించలేమని తెలిపారు. వారికి వేరే అవకాశాలేవీ లేవన్నారు. బిచ్చమెత్తుకోవాలని ఎవరూ కోరుకోరన్నారు. వీథులు, బహిరంగ స్థలాలు, ట్రాఫిక్ జంక్షన్ల నుంచి బిచ్చగాళ్ళను తొలగించాలని తాము ఆదేశించలేమని చెప్పారు. ప్రభుత్వం స్పందించవలసిన, సాంఘిక సంక్షేమ విధానానికి సంబందించిన విషయమని తెలిపారు. ‘‘మా కళ్ళ ముందు నుంచి వారిని దూరంగా ఉంచండి’’ అని తాము ఆదేశించలేమని తెలిపారు. ఈ మానవ సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అడ్వకేట్ కుశ్ కల్రా దాఖలు చేశారు. ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, బహిరంగ స్థలాల్లో భిక్షాటనను నిరోధించాలని, బిచ్చగాళ్ళు, యథేచ్ఛగా సంచరించేవారిని తొలగించాలని కోరారు. 

* ఒలింపిక్స్‌లో మూడో రౌండ్ వ‌ర‌కూ చేరి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్ మ‌నికా బాత్రా చిక్కుల్లో ప‌డింది. మ్యాచ్‌ల సంద‌ర్భంగా నేష‌న‌ల్ కోచ్ సౌమ్య‌దీప్ రాయ్‌ని మ‌నికా బాత్రా నిరాక‌రించ‌డంపై టేబుల్ టెన్నిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. అంతేకాదు అత‌న్ని సుతీర్థ ముఖ‌ర్జీ వ్య‌క్తిగ‌త కోచ్‌గా అభివ‌ర్ణించ‌డాన్ని ఫెడ‌రేష‌న్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ అరుణ్‌కుమార్ బెన‌ర్జీ త‌ప్పుబ‌ట్టారు. టీమ్ ఇండియాకు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత దీనిపై చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సౌమ్య‌దీప్‌ను సుతీర్థ వ్య‌క్తిగ‌త కోచ్ అని అన‌డం ఏమాత్రం ప్రొఫెష‌న‌ల్ కాద‌ని, దీనిపై ఎలాంటి చ‌ర్య తీసుకోవాల‌ని ఆలోచిస్తామ‌ని అరుణ్‌కుమార్ చెప్పారు. ఇది త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌. సౌమ్య‌దీప్ అకాడ‌మీలో సుతీర్థ ఆడుతుండ‌వ‌చ్చు కానీ.. సౌమ్య‌దీప్ ఓ నేష‌న‌ల్ కోచ్‌. త‌న‌తోపాటు కోచ్ అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం మ‌నికా చేసిన త‌ప్పు. మ‌నికా వ్య‌క్తిగ‌త కోచ్ కావాల‌ని అడిగింది. దానికి మేము కూడా స‌రే అన్నాం. కానీ టోక్యో వెళ్లిన త‌ర్వాత సౌమ్య‌దీప్ స్థానంలో త‌న కోచ్ కావాల‌ని అడ‌గడం స‌రికాదు అని అరుణ్‌కుమార్ స్ప‌ష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ క‌మిటీతో చ‌ర్చించి ఎలాంటి చ‌ర్య తీసుకోవాలో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు.

* కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ది. అక్క‌డ గ‌త కొన్ని రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇవాళ అమాంతం పెరిగింది. ఇవాళ ఒక్క‌రోజే కేర‌ళ‌లో కొత్త‌గా 22,129 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. పాజిటివిటీ రేటు కూడా 12.35 శాతానికి పెరిగింది.

* క‌ర్ణాట‌క‌కు కాబోయే కొత్త ముఖ్య‌మంత్రి పేరు మ‌రికాసేప‌ట్లో ఖ‌రారు కానుంది. క‌ర్ణాట‌క బీజేపీ ఎమ్మెల్యేల‌తో మాట్లాడి కొత్త ముఖ్య‌మంత్రిని ఖ‌రారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం.. కేంద్ర‌మంత్రులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, జీ కిష‌న్‌రెడ్డిల‌ను ప‌రిశీల‌కులుగా పంపింది. వారు కొద్దిసేప‌టి క్రిత‌మే బెంగ‌ళూరుకు చేరుకున్నారు. కాసేప‌ట్లో బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసి కొత్త ముఖ్య‌మంత్రిని ఎన్నుకోనున్నారు.

* ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ ప్ర‌ధాని మోదీని క‌లిశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె 7 లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవ‌ల బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఈ ఇద్ద‌రూ ఢిల్లీలో తొలిసారి క‌లుసుకున్నారు. రాష్ట్రానికి బాకీ ఉన్న నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని మ‌మ‌తా కోరిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ల‌ను కూడా అధిక మొత్తంలో రిలీజ్ చేయాల‌ని ఆమె అభ్య‌ర్థించారు. య‌శ్ తుఫాన్ స‌మీక్ష స‌మ‌యంలో స్వ‌ల్ప వ్య‌వ‌ధి పాటు మే నెల‌లో ఇద్ద‌రూ మాట్లాడుకున్న విష‌యం తెలిసిందే.

* ఫైజ‌ర్‌, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్న వారిలో ఆరు వారాల త‌ర్వాత యాంటీబాడీల సంఖ్య త‌గ్గుతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు. ఇక ప‌ది వారాల త‌ర్వాత వాటి సంఖ్య 50 శాతం ప‌డిపోయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ద లాన్సెట్ జ‌ర్న‌ల్ త‌న ప‌త్రిక‌లో ప్ర‌చురించింది. బ్రిట‌న్‌కు చెందిన యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్(యూసీఎల్‌) ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని తెలిపారు. ఒక‌వేళ ఇలాగే యాంటీబాడీల సంఖ్య త‌గ్గుతూపోతుంటే, అప్పుడు కొత్త వేరియంట్ల‌తో ప్ర‌మాదం ఏర్ప‌డే అవ‌కాశాల ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. ఆస్ట్రాజెనికా టీకాల‌ను కోవీషీల్డ్ పేరుతో ఇండియాలో పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. రెండు డోసుల కోవీషీల్డ్ క‌న్నా.. రెండు డోసుల‌ ఫైజ‌ర్ చాలా మేలు అని లండ‌న్ వ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చెప్పారు. అయితే వ్యాక్సిన్లు తీసుకున్న‌వారిలో రోగనిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు అంచనా వేశారు.

* కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా కమలహాసన్‌ రెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో రామగుండం సీపీగా పనిచేస్తున్న సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా రమణకుమార్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

* రాష్ట్రంలో కోవిడ్‌ను బాగా అరికట్టగలిగామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంపై ఆయన మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కోవిడ్‌పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. కరోనా అనుమానంతో ఎవరైనా వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలన్నారు.

* ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఇరా ఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముంది అంటారా? మరేం లేదు, ఇరా ఖాన్‌ తన కుక్కపిల్లను కాళ్ల మీద పడుకోబెట్టుకుని ఉంది. ఆమె పక్కనే ఓ వస్తువుంది, కానీ అది బ్లర్‌ అయి ఉంది. అయితే బ్లర్‌ చేసినప్పటికీ అదేంటో పసిగట్టారు నెటిజన్లు. కచ్చితంగా అది సిగరెట్‌ బాక్స్‌ లేదా లైటర్‌ అయ్యుంటుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరా ఖాన్‌ సిగరెట్‌ తరచూ తాగుతుందని, ఇంతకీ ఏ బ్రాండ్‌ సిగరెట్‌ తాగుతుందో? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అక్కడ సిగరెట్‌తో పాటు లైటర్‌ కూడా ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొద్దిమంది మాత్రం ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను కూడా విమర్శిస్తున్నారు. ‘సెలబ్రిటీల పిల్లలు ఎందుకు సరిగా బట్టలు వేసుకోరు’, ‘ఆమె ప్యాంటు వేసుకోవడం మర్చిపోయినట్లుంది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

* ప్రపంచ వ్యాప్తంగా పలు మల్టీనేషనల్‌ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడానికి నడుం బిగించాయి. పలు కంపెనీలు భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఉన్న ఆదరణను క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్న టెస్లాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాలను భారత్‌లో ప్రవేశపెట్టాలని ఎలన్‌ మస్క్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

* ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ తొలగించింది. ప్రతీ ఏటా ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25శాతం వెయిటేజ్ ఇస్తున్న ఉన్నత విద్యామండలి.. కోవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఈ ఏడాది వెయిటేజ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే.. అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

*