Food

రొయ్యల పచ్చడి చేసే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పచ్చడి రుచిగా రావాలంటే నాణ్యమైన రొయ్యలను ఎంచుకోవాలి. పచ్చడికి పెద్ద రొయ్యలే బాగుంటాయి. చిన్నవి వద్దు. ముందుగా వీటిని బాగా శుభ్రం చేసి గిన్నెలో నీళ్లు పోసి మూతపెట్టి కాసేపు ఉడికించాలి. రొయ్యలు ఒకవంతు ఉడకగానే స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. నీళ్లు పూర్తిగా పారబోసి రొయ్యలను తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే పచ్చడిలో వేశాక మరింత రుచిగా, మెత్తగా ఉంటాయి. మరో గిన్నెలో చింతపండు వేసి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలను నూనె లేకుండా వేయించి చల్లార్చుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు రొయల్ని నూనెలో వేయించాలి. ఈ పచ్చడికి వేరుసెనగ నూనె రుచిని ఇస్తుంది. సాధ్యమైనంత వరకు గానుగ నూనె వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దోరగా వేగిన రొయల్ని తీసి పక్కన పెట్టుకుని అదే నూనెలో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి, రొయ్యలు, చింతపండు గుజ్జు ఒకదాని తర్వాత మరొకటి అన్ని నూనెలో కలిపితే పచ్చడి రెడీ. చింతపండు ఇష్టపడని వారు పులుపు సరిపోయేంత నిమ్మరసం కలపొచ్చు. కొబ్బరి పొడి, ధనియాల పొడి కూడా కలిపితే పచ్చడిలో గ్రేవీ బాగా వస్తుంది. కొంతమంది కలిపిన పచ్చడికి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు కూడా పెడుతుంటారు. అలాగే మసాలా వేయించి పొడి చేసి కలపడానికి బదులు నేరుగా గరంమసాలా కూడా కలిపేస్తారు. నిమ్మరసం బదులు వెనిగర్‌నూ వాడుకోవచ్చు. తాలింపులో మెంతులు లేదా చెంచా మెంతిపిండి కూడా కలపొచ్చు. ఈ పచ్చడి సాధ్యమైనంత వరకు గాజు సీసా/ పింగాణీ జాడీలో భద్రపరుచుకోవాలి. మూత గట్టిగా పెట్టడం వల్ల చాలారోజుల వరకు పాడవకుండా ఉంటుంది. పచ్చడి తయారీలో కల్లుప్పును వాడితే ప్రత్యేకమైన రుచి వస్తుంది. మసాలా దినుసులను చిన్నమంటపై దోరగా వేయించాలి. ఏమాత్రం ఎక్కువగా వేగినా రుచి మారిపోతుంది. ఉడికించిన రొయ్యల్లో ఏమాత్రం నీళ్లు లేకుండా పూర్తిగా డ్రై చేసిన తర్వాతే వేయించుకోవాలి. లేదంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. పచ్చడి తయారీకి వాడే పాత్రలన్నీ పొడిగా ఉండాలి. పచ్చడిలో ఎండు మిరపకాయలకు బదులుగా కొన్నిచోట్ల పచ్చిమిరపకాయలు కూడా వాడుతుంటారు.