Politics

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము-తాజావార్తలు

* కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

* గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్‌ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి కనిపించకపోవడంతో ఆమె కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీసెట్‌) నిర్వహణ బాధ్యతను కాకినాడ జేఎన్‌టీయూకు విద్యా శాఖ అప్పగించింది. జూన్‌ 25న ఏపీఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దరఖాస్తుల నమోదు పక్రియను జూన్‌ 26 నుంచి ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రారంభించింది.

* దేశ రాజధాని నగర శివారులో ఇటీవల జరిగిన తొమ్మిదేళ్ల దళిత బాలికపై హత్యాచార ఘటనను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాజకీయం చేస్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ఇలాంటి ఘటనల్లో బాధితుల ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేయరాదని, ఆయా అంశాలను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేయరాదన్నారు.

* రోడ్లపై నానాటికీ పెరిగిపోతున్న రద్దీని చక్కదిద్దడం కష్టమవుతోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ పరిశోధకులు దీనికి స్మార్ట్‌ విరుగుడును కనిపెట్టారు. ట్రాఫిక్‌ నియంత్రణలో మానవ ప్రమేయాన్ని తగ్గించే వ్యవస్థను రూపొందించారు. ప్రమాదకర మలుపుల వద్ద యాక్సిడెంట్లను ఇది నివారిస్తుంది. వాహనాల సంఖ్య, వేగాన్ని గుర్తించడానికి, రోడ్డును మెరుగ్గా ఉపయోగించుకోవడానికి సాయపడుతుంది.

* అఫ్గాన్‌లో పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో… పాకిస్థాన్‌కు చెందిన జాతీయ భద్రతా సంఘం (ఎన్‌ఎస్‌సీ) సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దీనికి అధ్యక్షత వహించారు. అఫ్గాన్‌ నుంచి తమ దళాలను ఉపసంహరించుకుంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఈ కమిటీ సమర్థించింది. పొరుగు దేశంలో విదేశీ దళాలు దీర్ఘకాలం తిష్ట వేయడం వల్ల భిన్నమైన ఫలితాలేవీ రాలేదని తీర్మానించింది.

* ఏ యుద్ధంలోనూ ప్రత్యర్థుల చేతికి మన ఆయుధాలు దొరకడం అత్యంత ప్రమాదకరం. వారు ఆ ఆయుధాలను వాడటమే కాదు.. వాటిల్లోని లోటుపాట్లు గ్రహించి మనల్ని దెబ్బతీస్తారు. ఈ విషయం అమెరికాకు తెలియనిది ఏమీ కాదు..! అఫ్గాన్‌లో సోవియట్‌ దురాక్రమణ ముగిశాక అంతర్యుద్ధం మొదలైంది. అనంతరం ముజాహిదీన్‌లు పాలన ప్రారంభించారు. అలా ఓ యుద్ధవిమానం దక్కించుకొని తాలిబన్లు రష్యా వ్యాపారి విమానాన్ని హైజాక్‌చేశారు.

* అధికారం చేజిక్కించుకున్నాక తాలిబన్లు కొద్ది గంటల క్రితం అఫ్గాన్‌ పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించారు. అక్కడ నాయకుల కుర్చీల్లో వారు రైఫిల్స్‌ తీసుకొని కూర్చొని వీడియోలు చిత్రీకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను జర్నలిస్టు, వ్యాపారవేత్త అయిన వాజాత్‌ ఖాజ్మీ ట్వీట్‌ చేశారు. రెండు వారాల క్రితం ఇదే భవనంలో దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పార్లమెంట్‌ సమావేశాలను నిర్వహించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఊగిసలాటలో పయనించిన సూచీలు చివర్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో గతవారం నుంచి కొనసాగుతున్న లాభాల జోరును సూచీలు మళ్లీ అందుకున్నట్లైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా దిద్దుబాటుకు గురవడం గమనార్హం.

* రెండో టెస్టులో వ్యూహాత్మక తప్పిదాలు చేశామని ఇంగ్లాండ్‌ సారథి జోరూట్‌ అన్నాడు. టీమ్‌ఇండియా లోయర్‌ ఆర్డర్‌ను తక్కువ అంచనా వేశామని అంగీకరించాడు. జస్ప్రీత్‌ బుమ్రా (34*), మహ్మద్‌ షమి (56*) తమ నుంచి గెలుపును లాగేసుకున్నారని స్పష్టం చేశాడు.

* మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. దిశ చట్టం తెచ్చాక గతంలో ఉన్న దర్యాప్తు వ్యవధిని గణనీయంగా తగ్గించామని.. ప్రస్తుతం కేవలం 42 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నామన్నారు. ఏడు రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దిశ చట్టం తీసుకొచ్చాక 2వేలకు పైగా కేసుల్లో ఏడు రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామన్నారు. ఈ చట్టం కింద ఇప్పటివరకు 180 మంది దోషులకు శిక్ష విధించగా.. వారిలో ముగ్గురుకి ఉరిశిక్ష పడిందన్నారు. దిశ యాప్‌ను మహిళలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. దిశ చట్టం కింద తీసుకున్న చర్యల వల్ల ఐదు జాతీయ స్థాయి అవార్డులు రాష్ట్రానికి వచ్చాయన్నారు.

* ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద 62 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు ఇస్తున్నాం. రైతు బంధు వచ్చాక రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాయి. ఇప్పుడు దేశంలోని 11 రాష్ట్రాలు రైతు బంధును అమలు చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రమే ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఉంది. విభజన వల్ల రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్లు ఏమయ్యాయో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పటివరకూ 1.39 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. నాన్న నన్ను ఐఏఎస్‌ చేయాలనుకున్నారు. నాన్నకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాను’’ అని కేటీఆర్‌ తెలిపారు.

* కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని.. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగించాలన్నారు.

* నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న ఖరీదైన కార్లను రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుకున్నారు. సుమారు 15 విలాసవంతమైన విదేశీ వాహనాలను పట్టుకున్నాని రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావు తెలిపారు. మిగిలిన వాహనాలకు సంబంధించిన పన్నులు చెల్లించినట్లు ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటికి అపరాధ రుసుము కింద సుమారు రూ.5 కోట్లు వసూలయ్యే అవకాశాలున్నాయన్నారు.