Kids

శ్మశానంలో పిరికివాడు-తెలుగు చిన్నారుల కథ

శ్మశానంలో పిరికివాడు-తెలుగు చిన్నారుల కథ

అనగనగా ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.

నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం…ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో…ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.

ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, “ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం” అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!

రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, “ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా” అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది. పెద్దాయన ఆశ్చర్యంతో, ” సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?”
రైతు, “ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!”
రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!

పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో ‘మేము ఉన్నాం’ అనే భరోసా కారణం..
కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం…

కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..