Movies

రాజమండ్రిలో నిర్మాతల జేబులకు చిల్లు పెట్టిన శ్రీవిద్య

రాజమండ్రిలో నిర్మాతల జేబులకు చిల్లు పెట్టిన శ్రీవిద్య

నటి శ్రీవిద్య అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ప్రసిద్ధ గాయని ఎం.ఎల్‌. వసంతకుమారి కుమార్తె. ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు అవుట్‌డోర్‌ షూటింగ్‌కి రాజమండ్రి దగ్గరలోని గ్రామానికి వెళ్లారు. ఉండటానికి ఏర్పాట్లు బాగానే ఉన్నా, స్నానాలు మాత్రం పక్కనే ఉన్న గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చింది. వరదల కారణంగా నీరు బురదగా ఉండటంతో ఒక రకమైన కాయను అరగదీసి కలిపితే బురద కిందకు పోయి, స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. నిర్మాణశాఖలోని సహాయకులు ఆ నీరే పట్టి నటీనటులకి స్నానానికి అందించేవారు. కానీ, శ్రీ విద్య మాత్రం ఆ నీటితో స్నానం చేసేందుకు అంగీకరించలేదు. ఎంత తేటగా ఉన్నా, ఇంకా వరద బురద కలిసే ఉంటుందని, ఈ నీటితో స్నానం చేస్తే, తన శరీర సొగసు పాడవుతుందని, ఆరోగ్యం దెబ్బ తింటుందని పేచీ పెట్టారు. దాంతో అందరికీ తాగడానికి ఇస్తున్న ‘బిస్లరీ’ నీటిని తెప్పించి, బకెట్లలో పోసి ఇవ్వమన్నారు. బిస్లరీ వాటర్‌ అప్పుడే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చింది. అప్పుడు లీటరు సీసా ఆరు రూపాయాలు. అలాంటి సీసాలు రెండు బకెట్లకి సరిపడా చిత్ర నిర్మాతలు తెప్పించి రెండు పూటలా శ్రీవిద్య స్నానానికి అందించారు.