ఉగాండాలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగండా, ఇండియాలోని డాక్టర్ సినారె – వంశీ విజ్ఞాన పీఠం సహకారంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికి శాఖ, 5 ఖండాల్లోని తెలుగు సంస్థల అభినందనలతో కాళోజీ 107వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా అధ్యక్షులు పార్థసారథి వెల్దుర్తి తెలిపారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే.
అంతర్జాలం వేదికగా నిర్వహించే ఈ వేడుకల్లో కాళోజీ పురస్కారాలు అందుకున్న డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, గోరటి వెంకన్న, డాక్టర్ ఆర్ సీతారాం, డాక్టర్ అంపశయ్య నవీన్, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ రమా చంద్రమౌళి, డాక్టర్ పెన్నా శివరామకృష్ణ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డాట్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ బీ వేణుగోపాలరావు, కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీరామరాజు, డాక్టర్ జే చెన్నయ్య, కాళోజీ రవికుమార్, కాళోజీ సంతోష్, నాగిళ్ల రామశాస్త్రి, డాక్టర్ వ్యాసకృష్ణ బూర్గుపల్లి పాల్గొననున్నారు.