Politics

మల్లారెడ్డి కబ్జాలపై ఆధారాలు తీసుకువచ్చిన రేవంత్

మల్లారెడ్డి కబ్జాలపై ఆధారాలు తీసుకువచ్చిన రేవంత్

మంత్రి మల్లారెడ్డి భూ అక్రమాలకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ చుట్టు పక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్‌డీడ్‌ చేయాల్సిందేనని.. కానీ 16 ఎకరాలకు మల్లారెడ్డి బావమరిది ఎలా యజమాని అయ్యారో వివరాలు లేవన్నారు. గిఫ్ట్‌ డీడ్‌ చూపెట్టి మల్లారెడ్డి వర్శిటీకి అనుమతి తెచ్చుకున్నారని ఆరోపించారు.

‘‘గుండ్ల పోచంపల్లి గ్రామంలో 650 సర్వే నెంబరులో ఉన్న భూమి 22 ఎకరాల 20గుంటలు. తాజాగా ధరణి వివరాల ప్రకారం.. 33 ఎకరాల 26 గుంటలు అయింది. ఇది ఏమైనా కేసీఆర్‌ నాటిన మొక్కా.. పెరిగి పెద్దది అవ్వడానికి? ఇందులో 16 ఎకరాలు మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్‌ పేరు మీద ఉంది. ఈ భూమిలోనే మల్లారెడ్డి ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుపై గిఫ్ట్‌ డీడ్‌ పెట్టి, యూనివర్సిటీకి అనుమతి తీసుకున్నారు. 2004లో ఇదే భూమిని గ్రామ పంచాయతీ లేఅవుట్‌లుగా అమ్మారు. ఆ తర్వాత మళ్లీ హెచ్‌ఎండీఏ పేరుతో ఇదే భూమిని లేఅవుట్‌లు వేసి విక్రయించారు. 650 సర్వే నెంబర్‌లో లేఔట్‌లు చేసి, రెండుసార్లు ప్లాట్లు అమ్మారు. అమాయక ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసిన తర్వాత 22 ఎకరాలు కాస్తా.. 33 ఎకరాలు ఎలా అయింది? అందులో 16 ఎకరాలు శ్రీనివాస్‌రెడ్డికి ఎలా వచ్చింది? దీని వెనుకున్న అక్రమాలపై పాత్రికేయ మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి దృష్టికి తీసుకొస్తున్నా. మీ మంత్రివర్గంలో నీతి, నిజాయతీ కలిగిన వాళ్లుగా చెబుతున్న వీరు ఈ అక్రమాలు ఎలా చేశారో చెప్పాలి. అంతేకాదు, జవహర్‌నగర్‌లో ఉన్న ఐదెకరాల ప్రభుత్వ భూమిలో రిజిస్ట్రేషన్ నిషేధించిన తర్వాత భూమి ఎలా బదిలీ అయ్యింది? గజ దొంగలను పక్కన పెట్టుకుని… కేటీఆర్ నీతులు చెబుతున్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌లో వందల కోట్ల దుర్వినియోగం జరిగినట్టు విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక బయట పెట్టాలి’ అని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.