Agriculture

వరి బంద్ జేయమంటున్న కేసీఆర్

వరి బంద్ జేయమంటున్న కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలో ఉప్పుడు బియ్యం కూడా కొనలేమని తేల్చి చెప్పినందున రాష్ట్రంలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని.. రైతులు ఇకముందు వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని వ్యవసాయశాఖ ఉన్నత స్థాయి సమీక్షలో అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పిన దరిమిలా, ఇక వచ్చే యాసంగి నుంచి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమేననే ప్రగతిభవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరుసెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుత వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోబోమని కేంద్రం నిర్మొహమాటంగా చెప్పినందున, ధాన్యాన్ని ప్రభుత్వం గానీ, మిల్లర్లు గానీ కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రానున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల అధికారులు మాట్లాడారు. ‘‘తెలంగాణలో గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా త్వరగా తీసుకుంటే వానాకాలంలో ఉత్పత్తయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని పేర్కొంటూ, ఇటీవల రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్‌, కేటీఆర్‌లు కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలసి విన్నవించారు. ఇప్పటికే కేంద్రం వద్ద అయిదేళ్లకు సరిపడా నిల్వలున్నాయని, కొత్తగా కిలో కూడా కొనలేమని ఆయన తేల్చిచెప్పారు. దేశంలో కరవు, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని ప్రజావసరాల దృష్ట్యా ధాన్యం నిల్వ చేయడం కేంద్ర ప్రభుత్వ విధి, రాష్ట్రాలు తమకు పంటలను కనీస మద్దతు ధర ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం వరకే రాష్ట్రాల బాధ్యత. కేంద్ర మంత్రి గోయల్‌ మాత్రం ఇప్పటికే నిల్వలు ఉన్న దృష్ట్యా కొత్తగా కొనేది లేదంటున్నారు’’ అని వారు పేర్కొన్నారు.