ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవికి తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మరోవైపు, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులిటెన్లో పేర్కొన్నాయి. శుక్రవారం రాత్రి స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తుండగా సాయిధరమ్ తేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని తీగల వంతెన-ఐకియా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మెడికవర్లో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన్ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైదుల్ని అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు రోజుల్లో సాయిధరమ్ తేజ్ ఇంటికి తిరిగి వస్తాడని ఆకాంక్షించారు. ఐసీయూలో ఉన్న సాయిధరమ్ తేజ్ని మోహన్బాబుతోపాటు ఆయన కుమార్తె మంచు లక్ష్మీ చూసేందుకు వెళ్లారు.
చిరంజీవికి చంద్రబాబు ఫోను
Related tags :