NRI-NRT

విశాఖలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు నా లక్ష్యం-జగన్

విశాఖలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు నా లక్ష్యం-జగన్

విశాఖలో అమెరికన్‌ కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ను ఆయన అమరావతి నుంచి ఆన్‌లైన్లో ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో మూడో ‘అమెరికన్‌ కార్నర్‌’ విశాఖలో ఏర్పాటు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి, ఆ దేశం వెళ్లాలని అనుకునేవారికి అమెరికన్‌ కార్నర్‌ అందించే సేవలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అమెరికన్‌ కార్నర్‌ తరహాలోనే అమెరికన్‌ కాన్సులేట్‌ కూడా విశాఖలో ఏర్పాటు కావాలని కోరుకుంటున్నానని వివరించారు. విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన యు.ఎస్‌.కాన్సుల్‌ జనరల్‌ జోయెల్‌ రీఫ్‌మాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కడప నుంచి యు.ఎస్‌.ఎ.ఐ.డి.భారత్‌, భూటాన్‌ దేశాలకు మిషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన తెలుగు మహిళ వీణారెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు. కంప్యూటర్‌ మీట నొక్కి అమెరికన్‌ కార్నర్‌ను ప్రారంభించారు.