Politics

మరో యాత్రకు చంద్రబాబు ప్రణాళిక

మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల్లో పరాజయం తరువాత టీడీపీల నైరాశ్యం ఏర్పడింది. కరోనా కారణంగా చంద్రబాబు హైదరాబాద్ లో ఉండిపోవటం కూడా పార్టీకి మైనస్ గా మారింది. చంద్రబాబు పార్టీ పైన పట్టు కోల్పోతున్నారనే అభిప్రాయం కనిపిస్తోంది. వరుసగా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించటం తో వైసీపీ తమకు ఎదురు లేదనే విధంగా మైండ్ గేమ్ ప్రారంభించింది. ఇదే సమయంలో కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు.

*** ఇక ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు నిర్ణయం..:
ప్రభుత్వం.. ముఖ్యమంత్రి లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న సార్వత్రిక ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యే వైసీపీకి దగ్గరయ్యారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి..కేశినేని నాని లాంటి వారు సైతం పార్టీ తీరు పట్ల సుముఖంగా లేరు. పార్టీకి బలం ఉన్న అనంతపురం జిల్లాలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. పార్టీలో జోష్ కోసం పార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు. లోకేశ్ పరామర్శల కోసం జిల్లా యాత్రలు చేస్తున్నా.. అవి దీర్ఘకాలంలో పార్టీ బలోపేతానికి మేలు చేసేవిగా కనిపించటం లేదు.

*** ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి..:
దీంతో..ఇక, చంద్రబాబు తానే మరో సారి ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించారు. అందు కోసం త్వరలో ప్రజాయాత్రను చేపట్టనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. గతంలో తాను చేపట్టిన ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రకు తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తొమ్మిదేళ్ల కింద చంద్రబాబు సుదీర్ఘ పాదయాత్ర చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో 2,340కి.మీ. నడిచారు. అప్పట్లో హిందూపూర్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఆ తరువాత రాష్ట్ర విభజనతో అటు పవన్ ..ఇటు బీజేపీతో పొత్తు ద్వారా 2014లో అధికారంలోకి వచ్చారు.

*** వైసీపీ ముందస్తు – చంద్రబాబు సైతం:
ఇక, తనకు ఏపీలో ఎదురు లేదనే భావనతో కనిపించారు. అయితే, అనూహ్యంగా 2019 ఎన్నికల్లో పార్టీ 23 సీట్లకే పరిమితం అయింది. ప్రతిపక్ష పార్టీగా నిలబడాల్సిన సమయంలో అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతోంది. దీంతో..తాను తిరిగి ప్రజల మధ్యనే ఉంటే పార్టీ కేడర్ లో భరోసాతో పాటుగా జోష్ వస్తుందని చంద్రబాబు అంచనాగా కనిపిస్తోంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి జగన్ సైతం వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీని సిద్దం చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచే ప్రశాంత్ కిషోర్ టీం వైసీపీ కోసం పని చేసేందుకు రంగంలోకి దిగుతోంది.

*** పాదయాత్రా.. బస్సు యాత్రా..?
దీంతో..అలర్ట్ అయిన టీడీపీ అధినేత తాను ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వాన్నిఇరుకున పెట్టటం..అదే విధంగా పార్టీ నేతలను యాక్టివ్ చేయటం లక్ష్యంగా దీనిని ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు లేదా లోకేశ్ పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయాలని భావిస్తున్నట్లుగా పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగానే ప్రజల్లోకి వెళ్లటం అవసరమనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లుగా తెలుస్తోంది.

*** జగన్ లక్ష్యంగా పాదయాత్ర:
అయితే, చంద్రబాబు ఈ సమయంలో పాదయాత్ర చేస్తారా..లేక బస్సు యాత్ర ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది. చంద్రబాబు పాదయాత్ర వైపే మొగ్గు చూపుతున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి.. వారి కష్టాలు తీర్చడానికి శక్తివంచన లేకుండా పనిచేశానని..కానీ, ఆ ఐదేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంద ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆనాటి పనులన్నింటినీ నాశనం చేసి, విధ్వంస పాలనకు జగన్‌ శ్రీకారం చుట్టారని ఆరోపించారు.

*** ఏపీలో రంజుగా మారుతున్న రాజకీయం..:
ఈ దుష్ట పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… అభివృద్ధి లేక ఆదాయాలు పడిపోయి విలవిల్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. దీనిని ప్రజలకు వివరించేందుకు, వారిలో చైతన్యం కలిగించేందుకు త్వరలోనే మనం ప్రజాయాత్ర ప్రారంభించబోతున్నాం” అని చంద్రబాబు ప్రకటించారు ఈ అవినీతి ప్రభుత్వంపై పోరాటానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
దీంతో..చంద్రబాబు ప్రజాయాత్ర ఎప్పుడు ప్రారంభించేది.. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లేది.. ఎలా ఉండబోతోందనేది ఇప్పటికే ప్రాధమికంగా చర్చలు చేసారని..త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. చంద్రబాబు ప్రజాయాత్ర ప్రారంభించటం ద్వారా ఏపీలో రాజకీయంగా మరింత రంజుగా మారే అవకాశం కనిపిస్తోంది.