Kids

పిల్లలందరూ తప్పక చదవాల్సిన లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ

పిల్లలందరూ తప్పక చదవాల్సిన లాల్ బహదూర్ శాస్త్రి నిజాయితీ

కంట నీరు తెప్పించే సాక్షాత్ భారత మాజీ ప్రధాని నిజాయితీ. లాల్‌బహదూర్‌ శాస్ర్తీ దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన *కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్ర్తీగారు) మీద వొత్తిడి చేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులు చేసి ఒక ఫియట్‌కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు మరణించారు.

ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు,ఆయన భార్య శ్రీమతి లలితాశాస్ర్తీగారికి మనీఆర్డర్ చేశారట,రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్‌లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట.మరో సందర్భంలో, లాల్‌బహదూర్‌శాస్ర్తీ ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్ర్తీ అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు, ఆ సంస్థవారు హరికృష్ణశాస్ర్తీకి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్‌బహదూర్‌శాస్ర్తీగారికి ఈ విషయం తెలిపారు,

ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేను ఊహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయం చేయండని నా దగ్గరకు వస్తారు, నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దానిని ఎలా అర్ధం చేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి, నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి వీలు లేదు’’ అన్నారట. అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా ?

దేశ ప్రధాని కాకముందు లాల్‌బహదూర్‌శాస్ర్తీగారు ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచారు, దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీఅయ్యారు, అపుడు అక్కడ ‘టాగూర్‌నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు, శాస్ర్తీగారు వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్‌ను కలిసి ‘శాస్ర్తీ’గారికి సొంత ఇల్లులేదు కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు,శాస్ర్తీగారికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్ర్తీగారి భార్య లలితా శాస్ర్తీగారితో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు ‘స్వంత ఇల్లు’ అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్ర్తీగారికి ఈ విషయం తెలిసింది, ఆయన చాలా బాధపడ్డారు.

తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు, మనం ప్రజాప్రతినిధులం, ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం, నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను, మీరు కూడా వాపసు ఇచ్చేయండి లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి’’అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట.
జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. దేశ ప్రధాని ఐన లాల్‌బహదూర్‌శాస్ర్తీ ఇలాంటి వ్యక్తిత్వాలే జాతిని నిర్మించేది. ఇది భావి భారత పౌరులైన మీకు స్ఫూర్తి రగిలించు గాక.