ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి వైద్యశాస్త్రంలో విశేష సేవలందించినందుకు ఈసారి ఇద్దరిని వరించింది. అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ జ్యూరీ వెల్లడించింది.
‘మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలు ఎలా ప్రారంభమవుతాయనే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడంలో ఎంతో కీలకమైనవి’ అని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది. రోజువారీ జీవితంలో ఈ అనుభూతులను చాలా తేలికగా తీసుకుంటాం.. కానీ, ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపించబడతాయనే ప్రశ్నలకు తాజాగా ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారని నోబెల్ జ్యూరీ తెలిపింది.
డేవిడ్ జూలియస్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మరో శాస్త్రవేత్త అర్డెమ్ పటాపౌటియన్ కూడా కాలిఫోర్నియాలోని స్క్రిస్స్ రీసెర్చ్లో కేంద్రంలో ప్రొఫెసర్గా ఉన్నారు.