ScienceAndTech

ముగ్గురికి భౌతికశాస్త్ర నోబెల్

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ మంగళవారం ప్రకటించింది. సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకుగానూ వీరికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందిస్తున్నట్లు అకాడమీ తెలిపింది. అయితే ఇందులో జార్జియో పారిసీకి సగం పురస్కారాన్ని ఇవ్వగా.. మిగతా సగాన్ని సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌ పంచుకోనున్నారు. భూ పర్యావరణ భౌతిక నమూనా, వైవిధ్యాలను లెక్కించడం, గ్లోబల్‌ వార్మింగ్‌ను అంచనా వేయడంలో చేసిన కృషికి గానూ అమెరికాకు చెందిన సుకురో మనాబో, జర్మనీకి చెందిన హాసిల్‌మన్‌లకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి ప్రకటించారు. పరమాణువుల నుంచి గ్రహాల స్థితి గతులు, వలయాల వరకు భౌతిక వ్యవస్థల్లో హెచ్చుతగ్గులు, వాటి పరస్పర చర్యలను కనుగొన్నందుకు గానూ ఇటలీకి చెందిన జార్జియో పారిసీకి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.