Devotional

రేపు తిరుమలకు జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం తిరుమల వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 2 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3.30 గంటలకు బర్డ్‌ హాస్పిటల్‌కు చేరుకుంటారు. అక్కడ చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆస్పత్రిని ప్రారంభిస్తారు. తరువాత అలిపిరికి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు దాత నిర్మించిన నడక దారి, పై కప్పును, అక్కడే మరో దాత నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం నడక మార్గాన శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 12వ తేదీన ఉదయం 5.30 గంటలకు తిరిగి శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీపోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి బయలుదేరుతారు. 11.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.