‘పూజా హెగ్డే నాకొక్కడికే స్పెషల్ అనుకున్నా కానీ కాదు. తను అందరి హీరోలకీ స్పెషలే’ అని ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సక్సెస్ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా ఆయన విచ్చేసి, మాట్లాడారు. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన చిత్రమిది. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సెలబ్రేషన్స్ని నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘అఖిల్ నాకు తమ్ముడులాంటివాడు. తను పరిశ్రమలో అడుగుపెట్టకముందు.. అఖిల్ని ఇలా లాంచ్ చేస్తే బాగుంటుందా? అలా పరిచయం చేస్తే బాగుంటుందా? అని నాగార్జునగారితో చర్చించాను. నా సలహాలు ఇచ్చాను. తనంటే అంతిష్టం. ఈ సినిమాతో అఖిల్ మంచి విజయం అందుకోవడంతో వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నా. తను చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు.. అయినా వాటన్నింటినీ పక్కకుపెట్టి నటనకే ప్రాధాన్యం ఇవ్వాలనుకుని ఈ సినిమా చేసినందుకు రెస్పెక్ట్ ఇస్తున్నా. అక్కినేని కుటుంబంతో మాకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. ‘లవ్స్టోరి’తో హిట్ అందుకున్న నాగ చైతన్యకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? అనే సందేహంలో ఉన్నప్పుడు సినిమాని రిలీజ్ చేసి విజయం అందుకొని చిత్ర పరిశ్రమకి ధైర్యాన్నిచ్చిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఈ ఇద్దరి అన్నదమ్ముల విజయంతో నాగార్జున గారు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలుసు. ‘ముకుంద’ ఆడియో విడుదల వేడుక నుంచి పూజా హెగ్డేని చూస్తున్నా. సినిమా సినిమాకీ వైవిధ్యమైన నటన ప్రదర్శిస్తుంది. ఈ చిత్రంతో మరో మెట్టెక్కింది. నా ఒక్కడికే తను స్పెషల్ అనుకున్నా.. కానీ కాదు. అందరికీ స్పెషలే. తను ఏ హీరోతో నటిస్తే వారు హిట్ అందుకున్నట్టే! దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ హిట్ కొడతాడని ముందే తెలుసు’ అని అన్నారు.
అల్లు అర్జున్ను నిరాశపరిచిన పూజాహెగ్డే
Related tags :