Agriculture

పేకాట ఆగాలి. గంజాయి సాగు బంద్ జేయాలి-కేసీఆర్

పేకాట ఆగాలి. గంజాయి సాగు బంద్ జేయాలి-కేసీఆర్

రాష్ట్రంలోని పంటపొలాల్లో గంజాయి సాగు చేస్తే రైతుబంధు, రైతు బీమా నిలిపివేత.. అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) కింద పొందిన భూముల్లో పెంచితే పట్టాల రద్దు.. అంశాలను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. తమ గ్రామాల్లో గంజాయి సాగు వివరాలను సర్పంచులు ఆబ్కారీ అధికారులకు తెలియజేయాలన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, అందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా ఉండేందుకు వీలులేదని అన్నారు. దీని కోసం డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని, విద్యాసంస్థల వద్ద నిరంతర నిఘా ఉంచాలని, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. నేరగాళ్లు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయిపై బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, హోంశాఖ సలహాదారు అనురాగ్‌ శర్మ, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సప్‌ ద్వారా మెసేజ్‌లు అందుకొని సేవిస్తున్నారన్న నివేదికలు వస్తున్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ గంజాయి ఉత్పత్తి జరుగుతోంది. అక్కడి నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించి, ఇతర రాష్ట్రాలకు రవాణా జరుగుతోంది. రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో సైతం గంజాయి సాగు, సరఫరా ఉన్నందున ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్‌ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరం. గతంలో పేకాట నిషేధం అమలైన తీరుపై రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తిరిగి ఈ రుగ్మత సమాజంలో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పేకాట ఆగిపోవాలి.