Devotional

అట్లతద్ది తొలిసారిగా చేసింది గౌరీమాత

త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తివ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్లతద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమయినది. పిల్లలు , పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈరోజున తెల్లవారు జామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచియై తిరిగి గౌరీదేవి పూజ చేసి , ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు , 11 ఫలాలు వాయనంగా సమర్పించాలి. అట్లతద్ది నోము కథ చెప్పుకుని , శిరస్సుపై అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం , 11 తాంబూలం వేసుకోవడం , 11 ఊయల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు. కనుకనే ఈ పండుగకు ‘అట్లతద్ది’ అనే పేరు వచ్చింది. పదేళ్లు ఈ వ్రతాన్ని నిర్వహించి , ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులయిన బ్రహ్మ , విష్ణు , పరమేశ్వరుల భార్యలు సరస్వతి , లక్ష్మి , పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వీయుజం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా , పాడినా వాళ్లంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు.

అట్లతదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్థనారీశ్వర స్తోత్రం

చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
నమశ్శివాయై చ నమశ్శివాయ II

అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ II

ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః

ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్

అట్ల తద్దె 2021 తేదీ – శనివారం, అక్టోబర్ 23, 2021
తదియ తిథి ప్రారంభమవుతుంది – అక్టోబర్ 23, 2021 న 12:29 AM
తదియ తిథి ముగుస్తుంది – 03:01 AM అక్టోబర్ 24, 2021 న
సర్వేజనాః సుఖినోభవంతు – శుభమస్తు
————————————————————-
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి