DailyDose

మేడ్చల్‌లో ₹2కోట్ల డ్రగ్స్ స్వాధీనం-నేరవార్తలు

మేడ్చల్‌లో ₹2కోట్ల డ్రగ్స్ స్వాధీనం-నేరవార్తలు

* రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి రాసిన లేఖపై.. తగిన చర్యలు తీసుకుంటామంటూ ఆర్ బీఐ లేఖ.

* కుక్కునూరు మండలం వెంకటాపురం గ్రామం లో రాత్రి దొంగలు హల్ చల్ చేశారు రాత్రి సుమారు 1 గంటల సమయంలో శ్రీరాముల నాగ లక్ష్మి అనే మహిళ నిద్రిస్తున్న సమయంలో మెడలో నుంచి బంగారు గొలుసు దొంగలించారు సుమారు వీటి విలువ నాలుగు లక్షలు ఉండవచ్చని బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై విచారణ చేస్తున్నామని కుక్కునూరు పోలీసు వారు మీడియాకు తెలియజేశారు.

* పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం అలుగుల గూడెంలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి పాము కాటు వేయడంతో తాత కమ్ముల నంబూద్రీపాద్( 55), మనవడు కమ్ముల అధ్విక్ మృతి చెందాడు. తాత, మనవడు ఒకేసారి మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

* ఏలూరు రూరల్ మండలంలో మొన్న రాత్రి జరిగిన జాతరలో అశ్లీల నృత్యాలను నిర్వాహకులు నిర్వహించారు. ఇందులో భాగంగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఏలూరు రూరల్ సీఐ అనుసూరి శ్రీనివాస్ , ఏలూరు రూరల్ ఎస్సై చావా సురేష్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ.

* మేడ్చల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న మెపిడ్రిన్‌ డ్రగ్‌ను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పవన్‌, మహేందర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఎస్‌.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నారు. నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. విద్యార్థులకు సరఫరా చేయడానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇదే కేసులో కూకట్‌పల్లిలో పవన్‌ అనే వ్యక్తి వద్ద డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌లోని మహేశ్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహేశ్‌ వద్ద 926 వద్ద మెపిడ్రిన్‌ను గుర్తించారు. మహేశ్‌ ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్‌ వాసి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మొత్తం మూడు ప్రాంతాల్లో 4.92 కిలోల డ్రగ్స్‌, కారును అధికారులు సీజ్‌ చేశారు.

* తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ వ్యవహారంలో షిర్డీకు చెందిన మదన్‌ను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్‌ చేశారు. కేసులో నిందితురాలు, కెనరా బ్యాంకు మాజీ మేనేజర్‌ సాధన భర్త బాబ్జీకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తాజాగా అరెస్టయిన మదన్‌.. కీలక నిందితుడు సాయికుమార్‌కు ప్రాణస్నేహితుడు. ఇతడి ద్వారానే విశాఖపట్నానికి చెందిన సాంబశివరావుతో సంప్రదింపులు జరిపించారు. మధ్యవర్తిత్వం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. వీరు ఎప్పుడు షిర్డీ వెళ్లినా అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించేవాడు. ముగ్గురూ కలిసి రూ.64.05 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గతేడాది డిసెంబరులోనే తెలుగు అకాడమీ సొమ్ము కాజేసేందుకు తెలివిగా వ్యూహరచన చేశారు. అనంతరం తమకు అనుకూలమైన వ్యక్తులను సహకారంతో వ్యవహారం నడిపించారు. కోట్లాది రూపాయలు చేతికి అందగానే వాటాలు పంచుకున్నారు. ఆనక భారీగా ఆస్తులు కూడబెట్టారు. కేసును సవాల్‌గా తీసుకున్న నగర సీసీఎస్‌ పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రూ.64.05 కోట్లలో ఇప్పటివరకు రూ.20 కోట్లు స్వాధీనం చేసుకొని.. 17 మందిని అరెస్ట్‌ చేశారు. తెరవెనుక నుంచి నిందితులకు సహకరించిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. సీసీఎస్‌ పోలీసులు మాత్రం కేసుతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలబోమని స్పష్టం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన మరికొందరిని అరెస్ట్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేసులో కీలకమైన ఆధారాలు రాబట్టేందుకు సాంబశివరావు కస్టడీకు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం.