Politics

నేడే హుజూరాబాద్ ఫలితం

నేడే హుజూరాబాద్ ఫలితం

రాష్ట్ర స్థాయిలో ఉత్కంఠను రేపుతున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం వెల్లడికి సమయం ఆసన్నమైంది. హోరాహోరీగా నెలలపాటు సాగిన ప్రచార పర్వం తర్వాత జరిగిన ఈ ఎన్నికలో హుజూరా‘బాద్‌షా’గా ఎవరు నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలనుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలుత ఉదయం 8 గంటలకు 753 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కపెట్టడం ప్రారంభిస్తారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం రెండు కేంద్రాలను లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున ఏకకాలంలో రెండు చోట్ల 14 టేబుళ్లపై ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. ఇలా ఒక్కో రౌండ్‌లో 14 టేబుళ్లపై రెండు ఈవీఎంలలో ఆయా అభ్యర్థులకు పడిన ఓట్లను ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. మొత్తంగా 22 రౌండ్ల లెక్కింపు జరగనుంది. తొలిరౌండు ఫలితాలు ఉదయం 9:30 గంటలకు వచ్చే అవకాశం ఉంది. 30 మంది అభ్యర్థులు ఉండటంతో తుది ఫలితం వచ్చే సరికి సాయంత్రం అవనుంది.