Health

ఏపీలో డిజిటల్ హెల్థ్ ప్రారంభం-తాజావార్తలు

ఏపీలో డిజిటల్ హెల్థ్ ప్రారంభం-తాజావార్తలు

* దేశవ్యాప్తంగా చేపట్టిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ పనులు ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి అనంతపురం జిల్లా సర్వజనాస్పత్రితో పాటు తిరుపతి, విజయవాడ, కాకినాడ ఆస్పత్రులు ముందుకొచ్చాయి. డిసెంబర్‌ మొదటి వారంలో ఆయా చోట్ల ఏబీడీఎం (ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌) పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. మొదట ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది (ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌ తదితరులు) వివరాలతోపాటు అదనంగా వైద్య సదుపాయాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీరికి 14 అంకెలతో కూడిన నంబర్‌ కేటాయిస్తారు. ఈ వివరాలను పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఆ నంబర్‌తో కూడిన వ్యక్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నాలుగు ఆస్పత్రుల్లో నమోదు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. నాలుగు వారాల్లో బోధనాస్పత్రుల్లోనూ, ఆ తర్వాత నాలుగు వారాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ, తర్వాత నాలుగు వారాల్లో సీహెచ్‌సీల్లోనూ, చివరగా పది వారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ హెల్త్‌కేర్‌ ఫెసిలిటీస్, వైద్య సిబ్బంది వివరాలన్నీ సేకరించి ఏబీడీఎం పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. త్వరలోనే ప్రైవేటు ఆస్పత్రుల వివరాలనూ సేకరిస్తారు.

* పొట్టి ప్రపంచకప్‌-2021 తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో భారత హెడ్‌ కోచ్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి అనంతరం పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ తన మొదటి ఛాయిస్‌ అని పేర్కొన్నాడు. అనుభవం దృష్ట్యా రోహిత్‌ అయితేనే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించగలడని అభిప్రాయపడ్డాడు. కోహ్లి వారసుడిగా కేఎల్‌ రాహుల్‌ తన రెండో ప్రాధాన్యత అని తెలిపాడు.

* తాప్సీ పలు ఛానల్లకు ఇంటర్వ్యూలో ఇస్తూ బీజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్‌ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

* ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నేటి నుంచే ప్రారంభించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. హిందువులు దీపావళి పండగ చేసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు.

* పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన వేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను అడ్డంపెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసిందన్నారు. విమర్శించడం సులభమే.. కానీ ఆచరణలో పెట్టడానికి బలముండాలన్నారు. ఉపఎన్నిక వస్తేనే తెరాస నేతలకు జోష్‌ వస్తుందని ఎద్దేవా చేశారు.

* విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆరోపించారు. గత రెండేళ్లలో ఆ కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకాయిలను ఇప్పించేలా చూడాల్సిన యంత్రాంగం ఈ సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడటం భావ్యం కాదన్నారు.

* దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్‌ సుంకం కొంతమేర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఉప ఎన్నికల్లో భంగపడటంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కూడా సుంకం తగ్గింపుపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ప్రభుత్వం.. భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందే తప్ప మనస్ఫూర్తిగా కాదు. పండగకు ముందు ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సింది పోయి.. నిత్యవసర ధరలను భారీగా పెంచింది ’అని పేర్కొన్నారు.

* రక్షణ అవసరాల కోసమంటూ పెగాసస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ను అమెరికా అధికారులు బుధవారం బ్లాక్‌లిస్ట్‌ (నిషేధిత కంపెనీల జాబితా)లో చేర్చారు. అధికారులు, పాత్రికేయులపై నిఘా ఉంచేందుకు ఈ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించినట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రముఖులపై పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో ప్రభుత్వాలు నిఘా ఉంచుతున్నాయన్న వార్తలు వెలువడడంతో ఎన్‌ఎస్‌వోకు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.

* ఏడాది క్రితం తాము ఊహించినదానికంటే ఎక్కువ వేగంతో ప్రస్తుతం చైనా అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. దాని వద్ద అణు వార్‌హెడ్‌ల సంఖ్య వచ్చే ఆరేళ్లలో 700కు పెరుగుతుందని అంచనా వేసింది. 2030 కల్లా ఆ సంఖ్య వెయ్యి దాటే అవకాశముందని పేర్కొంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్నది మాత్రం తెలియజేయలేదు. గత ఏడాది లెక్కల ప్రకారం డ్రాగన్‌ వద్ద 200కు పైగా అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి.

* ఐరోపాలో కొవిడ్‌ కలకలం రేపుతోంది. వరుసగా ఐదో వారం కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో కొవిడ్‌ ఉద్ధృతి ఐరోపా ప్రాంతంలోనే పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం తెలిపింది. ఈమేరకు 6% కేసులు పెరిగినట్లు తాజా వారాంతపు నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో కేసులు తగ్గడం లేదా నిలకడగా కొనసాగడం కనిపిస్తోందని పేర్కొంది. ఇన్ఫెక్షన్‌ రేటు కూడా ఐరోపాలోనే ఎక్కువగా ఉంది.

* పర్యావరణ మార్పులపై అత్యంత కీలకమైన కాప్‌-26 సదస్సుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ మహా సమావేశాల్లో వందకు పైగా దేశాలు గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాల తగ్గింపు దిశగా కృషిచేసేందుకు పలు హామీలు ఇచ్చాయని, చైనా మాత్రం అలాంటి భరోసా ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. జి-20 సదస్సుతో పాటు కాప్‌-26కు డుమ్మా కొట్టడం ద్వారా చైనా పెద్ద తప్పు చేసిందని పేర్కొన్నారు.

* అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక కథానాయిక. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ని చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. హుషారైన ఓ గీతానికి వెయ్యిమందికిపైగా డ్యాన్సర్లతో కలిసి అల్లు అర్జున్‌ స్టెప్పులేస్తున్నారని తెలిపింది. లొకేషన్‌ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ పాటని వెండితెరపై చూస్తే పండగే అని పేర్కొంది

* టీమ్‌ఇండియాతో ఫైనల్స్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. అక్కడ కూడా మరోసారి కోహ్లీసేనను ఓడించాలని ఉందన్నాడు. అందుకోసం భారత్‌ ఫైనల్స్‌కు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అక్కడ టీమ్‌ఇండియా తమని ఓడించడానికి మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఉందన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడిన అక్తర్‌.. భారత్‌ – పాకిస్థాన్‌ మ్యాచ్‌లకు సంబంధించిన ‘మౌకా’ ఆడ్వర్టైజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.