Movies

కరివేపాకు కానంటున్న శోభిత

‘‘తెలుగు అమ్మాయిలకు తెలుగు చిత్రసీమలో అవకాశాలు ఇవ్వరు.. అనే మాట నేను నమ్మను. ఎందుకంటే నేను తెలుగు అమ్మాయినే. నాకు మంచి అవకాశాలే వస్తున్నాయి’’ అన్నారు శోభితా ధూళిపాళ్ల. తను దుల్కర్‌ సల్మాన్‌తో కలసి నటించిన ‘కురుప్‌’ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శోభిత మాట్లాడుతూ ‘‘కురుప్‌ ఓ దమ్మున్న స్ర్కిప్ట్‌. కథలో బలం ఉంటే విజయం తథ్యం. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నా. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారని చాలా భపడ్డా. ఎందుకంటే థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. నేను అనుకున్నట్టే.. ఈ సినిమా థియేటర్లలో రావడం ఆనందంగా ఉంది.‘కురుప్‌’తో నాకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఉంది. నాకెప్పుడూ కథే ముఖ్యం. నా పాత్ర నిడివి ఎంత అన్నది పట్టించుకోను. నా పాత్ర ఎప్పుడూ కూరలో కరివేపాకులా ఉండకూడదు. ఉప్పులా ఉండాలి. కరివేపాకు ఎంత ఉన్నా, తింటున్నప్పుడు పక్కన పడేస్తారు. ఉప్పు సమపాళ్లలో ఉంటేనే కూరకు రుచి వస్తుంది. నేను చేయబోయే చిత్రాలన్నీ నా కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లేవే’’ అన్నారు.