NRI-NRT

కాలిఫోర్నియాకు భారత విద్యార్థుల వెల్లువ

కాలిఫోర్నియాకు భారత విద్యార్థుల వెల్లువ

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధికులు ఇంజినీరింగు విద్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే తీరు కనిపిస్తోంది. అమెరికాలో చేరేవారికి సంబంధించిన గణాంకాలను అక్కడి ప్రభుత్వం ఏటా నవంబరులో విడుదల చేస్తుంది. గడిచిన వారం స్థూల సమాచారాన్ని, తాజాగా మరిన్ని గణాంకాలను విడుదల చేసింది. అమెరికా చదువులపై కరోనా తీవ్రప్రభావాన్ని చూపింది. ఈకారణంగా అమెరికాలోని విశ్వవిద్యాలయాలను మూసివేయడంతో పాటు అంతర్జాతీయ సరిహద్దులపై ఆంక్షలు విధించడంతో చదువుకునేందుకు వెళ్లే యువత తీవ్ర ఇబ్బందులకు గురైంది. గత ఏడాదితో పోలిస్తే 2020-21 విద్యాసంవత్సరంలో సుమారు 15 శాతం మంది విద్యార్థులు తగ్గారు. 2019-20లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,93,124 మంది చేరితే, 2020-21లో ఆ సంఖ్య 1,67,582కు తగ్గింది. అమెరికాలో అత్యధికులు కాలిఫోర్నియా రాష్ట్రంలో చదువుకుంటున్నారు. 2020-21 విద్యాసంవత్సరంలో 1,32,758 ఇక్కడే ఉన్నారు. రెండో స్థానంలో న్యూయార్క్‌ నిలువగా.. ఇక్కడ 1,06,894 మంది విద్యార్థులు ఉంటున్నట్లు తేలింది. తర్వాత స్థానంలో టెక్సాస్‌, మసాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఒహియో, మిచిగాన్‌ రాష్ట్రాలున్నాయి. అతితక్కువగా ఇండియానా రాష్ట్రంలో 23,948 మంది చదువుతున్నారు. విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలో 17,050 మంది చేరారు. బోస్టన్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ విశ్వవిద్యాలయం, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిదాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ ఇలా మరో 15 విశ్వవిద్యాలయాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అతి తక్కువగా ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ 6,665 మంది చేరారు.

* అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. చైనా తొలిస్థానంలో ఉంది.

* 2020-21 సంవత్సరంలో అత్యధికంగా 68,869 మంది గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరారు.

* అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో 23,734 మంది.., డిగ్రీయేతరులు 1,378 మంది చేరారు.

* 2020-21లో 73,601 మంది ఓటీపీ పథకం కింద ఉద్యోగాలు చేస్తున్నారు.