Sports

ప్రోకబడ్డీలో గుజరాత్ శుభారంభం

ప్రోకబడ్డీలో గుజరాత్ శుభారంభం

ప్రొ కబడ్డీ లీగ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ శుభారంభం చేసింది. గురువారం జరిగిన పోరులో గుజరాత్‌ 34-27తో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. తొలి అయిదు నిమిషాలు హోరాహోరీగా నడిచినా.. ఆ తర్వాత గుజరాత్‌ నెమ్మదిగా ఆధిపత్యం ప్రదర్శించింది. వరుసగా అయిదు పాయింట్లు గెలవడమేకాక ఆపై 13-7తో ఆధిక్యం సాధించింది. అయితే ఈ స్థితి నుంచి కోలుకున్న పింక్‌ పాంథర్స్‌ తొలి అర్ధభాగం ఆఖరికి 17-19తో ప్రత్యర్థిని సమీపించింది. అయితే ద్వితీయార్ధం ఆఖర్లో జైపుర్‌ని ఆలౌట్‌ చేసి 33-27తో ఆధిక్యంలోకి వెళ్లిన గుజరాత్‌.. అదే జోరులో విజయాన్ని సొంతం చేసుకుంది. రాకేశ్‌ నర్వాల్‌ (7), గిరీష్‌ (7), రాకేశ్‌ సంగ్రోయా (6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. జైపుర్‌ జట్టులో అర్జున్‌ దేశ్‌వాల్‌ (10) సత్తా చాటాడు. మరో మ్యాచ్‌లో దబాంగ్‌ దిల్లీ 41-30తో పుణెరి పల్టాన్‌పై విజయం సాధించింది. 25 రైడ్‌ పాయింట్లు సాధించడంతో పాటు పుణెరిని ఆరుసార్లు ఆలౌట్‌ చేసిన దిల్లీ విజయాన్ని సొంతం చేసుకుంది. విరామ సమయానికి 22-15తో నిలిచిన దిల్లీ.. ఆ తర్వాత కూడా అదే దూకుడు ప్రదర్శించింది. నవీన్‌కుమార్‌ సూపర్‌-10 సాధించడంతో ఆధిక్యాన్ని మరింత పెంచుకుని చివరికి విజయాన్ని అందుకుంది. దిల్లీ జట్టులో నవీన్‌ కుమార్‌ (14 రైడ్‌ పాయింట్లు, ఒక ట్యాకిల్‌, ఒక బోనస్‌ పాయింట్‌) జట్టు గెలుపులో భాగమయ్యాడు. విజయ్‌ మలిక్‌ (9) కూడా రాణించాడు. పుణెరి జట్టులో నితిన్‌ తోమర్‌ 2 బోనస్‌ పాయింట్లతో పాటు 7 పాయింట్లు సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మరో మ్యాచ్‌లో పట్నా పైరెట్స్‌ 42-39తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. మోను గోయత్‌ (15), ప్రశాంత్‌ (7), సచిన్‌ (7) రాణించి జట్టును గెలిపించారు. హరియాణా జట్టులో రోహిత్‌ (10), వికాశ్‌ (6), జైదీప్‌ (5), సురేందర్‌ (5) సత్తా చాటారు.