*మీరు జియో యూజర్లయితే.. ఇకపై రీచార్జి తేదీని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన కస్టమర్ల కోసం రియలన్స్ జియో మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో కస్టమర్లు ఇకపై యూపీఐ ద్వారా తమ టారిఫ్ ప్లాన్ రీచార్జ్ కోసం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్తో ఆటో డెబిట్ ఫీచర్ను సెట్ చేసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో కలిసి కంపెనీ ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్.. రెండు రకాల కస్టమర్లూ దీన్ని ఉపయోగించుకోవచ్చు.
*ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులు!
బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో వాటా విక్రయానికి వీలుగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. తాజాగా వాణిజ్యం, పరిశ్రమల శాఖ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐలు) విధానాల సవరణకు నడుం బిగించింది. ఆర్థిక శాఖ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తదుపరి ఇందుకు తగిన మార్పులను చేపట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
*ఇన్వెస్టర్లకు ఉపశమనం. లాభాలతో మొదలైన మార్కెట్
మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితితో లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న ఇన్వెస్టర్లకు శుక్రవారం ఉదయం కొంత ఉపశమనం కలిగింది. తక్కువ ధరల వద్ద షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించడంతో మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఇన్వెస్టర్లకు లాభాలు పంచిన షేర్లు.. గురువారం ఒక్క సారిగా పతనం అయ్యాయి. నాలుగు రోజుల పాటు వచ్చిన లాభాల్లో సింహభాగం ఆవిరైపోయాయి. దీంతో శుక్రవారం మార్కెట్ ఎలా ప్రారంభం అవుతుందనే టెన్షన్ ఇన్వెస్టర్లలో నెలకొంది.
* ఇన్సూరెన్స్ విభాగంలో నష్టాలను అదుపు చేసే చర్యలను ప్రోత్సహించే లక్ష్యంతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) మోటార్ ఇన్సూరెన్స్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్లకు రెండు హబ్లు, ఒక సలహా రమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ హబ్ నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలోను, మోటార్ ఇన్సూరెన్స్ హబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్లోను ఏర్పా టు చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. వీటికి తోడు ఎన్ఐఏ డైరెక్టర్ నాయకత్వంలో అడ్వైజరీ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలోని రిస్క్ తనిఖీ నివేదికల కు ఇది ఒక రిపాజిటరీగా వ్యవహరించడంతో పాటు ప్రామాణిక సర్వే నివేదికల ఫార్మాట్లు కూడా అభివృద్ధి చేస్తారు
*దేశంలో రూ.12,031 కోట్ల పెట్టుబడితో గ్రీన్ కారిడార్ రెండో దశకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు రాష్ర్టాల్లో ఉత్పత్తి అయ్యే 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన ట్టు ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ర్టాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి. ఈ ప్రాజెక్టును 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో అమలుపరుస్తారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రూ.10,142 కోట్ల పెట్టుబడితో చేపట్టిన తొలిదశలో భాగంగా ఇప్పటికే 80% పనులు పూర్తయ్యాయన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 33% అంటే రూ.3,970.34 కోట్లు కేంద్రం ఆర్థిక సాయంగా అందిస్తుంది.
*ఫార్మాస్యూటికల్ సంస్థల కోసం కోల్డ్ చెయిన్ లాజిస్టిక్ సొల్యూషన్లను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూఓహెచ్), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ జట్టు కట్టాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై ఈ సొల్యూషన్లను అభివృద్ధి చేయనున్నారు. యూఓహెచ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీ్సకు చెందిన విజయ భాస్కర్ మరిశెట్టి, వర్ష మామిడి..ఈ ప్రాజెక్ట్కు నేతృత్వం వహించనున్నారు. ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను సరఫరా చేయటంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ సొల్యూషన్లు తోడ్పాటునందించనున్నాయి.
*అరబిందో ఫార్మా మార్కెట్లోకి ‘మోల్నాఫ్లూ’ బ్రాండ్తో మోల్నుపిరవిర్ క్యాప్సుల్స్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని మెట్రోనగరాలు, పట్టణాలలోనూ మోల్నాఫ్లూ క్యాప్సుల్స్ లభిస్తాయని.. ఒక్కో క్యాప్సుల్ ధర రూ.49.97లని పేర్కొంది. మోల్నుపిరవిర్ను తయారు చేసి భారత్, వందకు పైగా తక్కువ ఆదాయ దేశాల్లో విక్రయించడానికి ఎంఎ్సడీతో గత ఏడాదిలో అరబిందో ఫార్మా నాన్ ఎక్స్క్లూజివ్ వాలెంటరీ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
*ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మార్కెట్లో ఆదరణ పెరుగుతోంది. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం.. శబ్ద కాలుష్యం వంటి సమస్యలు లేక పోవడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లను పెంచుతున్నాయని సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్ఎంఈవీ) డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. వినియోగదారులు హైస్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై మొగ్గు చూపుతున్నారన్నారు.
*దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీ్సకు చెందిన రిటైల్ వ్యాపార విభాగమైన రిలయన్స్ రిటైల్ తాజాగా క్విక్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. అగ్రగామి క్విక్ కామర్స్ కంపెనీ ‘డంజో’లో 25.8 శాతం వాటాను 20 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,488 కోట్లు) కొనుగోలు చేసింది. అలాగే, ఇరు కంపెనీలు వ్యాపారపరంగానూ కొన్ని భాగస్వామ్యాలు కుదుర్చుకున్నాయి. తద్వారా రిలయన్స్ రిటైల్ నిర్వహణలోని స్టోర్లకు డంజో హైపర్ లోకల్ లాజిస్టిక్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
*దివాలా ప్రక్రియలో ఉన్న వీడియోకాన్ గ్రూపు కంపెనీల ఆస్తు ల అమ్మకానికి బ్రేక్ పడింది. కంపెనీ ఆస్తులను అనిల్ అగర్వాల్ నాయకత్వంలోని ట్విన్ స్టార్ టెక్నాలజీ అమ్మేందుకు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచ్చిన తీర్పును ఎన్సీఎల్ఏటీ కొట్టి వేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు వీడియోకాన్ గ్రూపు దాదాపు రూ.64,838.63 కోట్లు బాకీ పడింది. ఈ ఆస్తులను ట్విన్ స్టార్ టెక్నాలజీ రూ.2,962 కోట్లకు అమ్మేందుకు గత ఏడాది ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ గీన్ సిగ్నల్ ఇచ్చింది.
*జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక సీఈఓ కెప్టెన్ సుధీర్ గౌర్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. అయితే జెట్ ఎయిర్వేస్ ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన రాజీనామాకు కారణాన్ని మాత్రం కంపెనీ వెల్లడించ లేదు.