Politics

పేదల పెన్నిది.. ముఖ్యమంత్రి అయినది నేడే

పేదల పెన్నిది.. ముఖ్యమంత్రి అయినది నేడే

*సరిగ్గా 39 సంవత్సరాల క్రితం ఇదే రోజున అన్నగారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు.
1983 జనవరి 9 తెలుగు కీర్తి దిగ్దిశాంతాలు దాటిన రోజు.రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరిన రోజు.పేదవాడికి అన్నం రుచి తెలిసిన రోజు.దేశంలో సరికొత్త రాజకీయం మొదలైన రోజు.నాటి ఢిల్లీ పాలకులకు తెలుగువాడి వాడి,వేడి తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు.తెలుగు నేల పులకించిన రోజు.35 ఏళ్ల అహంకారానికి చరమగీతం పాడిన రోజు.సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికిన రోజు.నందమూరి తారకరాముడు తెలుగుదేశాధీసుడిగా పట్టాభిషిక్తుడైన రోజు.

రామారావు గారు ప్రజలమనిషి రాజభవన్ గోడలు ఆయనకు ఇరుకుగా అనిపించాయి.అందుకే తాను లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలని కోరుకున్నారు.రాష్ట్ర చరిత్రలో అంతకు ముందు ఎవ్వరూ రాజభవన్ బయట ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయలేదు.
జనవరి 9 వ తేదీన లాల్ బహదూర్ స్టేడియం రికార్డు సంఖ్యలో రెండున్నర లక్షల మంది జనంతో కిటకిటలాడింది. చాలామంది లోపలికి వెళ్లలేక బయటే ఆగిపోయారు.ఆ చారిత్రక సన్నివేశాన్ని స్వయంగా చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచీ లారీల్లో,రైళ్ళలో,బస్సుల్లో జనాలు తరలివచ్చారు. హైదరాబాద్ నగరమంతా పండుగ వాతావరణం అలముకుంది.

ఆ రోజు జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది.గాంధేయవాది అయిన కె.సి. అబ్రహాం జనతా పార్టీ అధికారంలో ఉండగా ఆంధ్ర రాష్ట్రానికి గవర్నరుగా వచ్చారు.అంతకు ముందు పనిచేసిన రాష్ట్ర గవర్నర్లందరూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినవారే.అలాంటి కె.సి. అబ్రహాం గారు రాష్ట్రానికి తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి గా రామారావు గారి పదవీస్వీకార ప్రమాణం చేయించారు.రామారావు గారు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ప్రజలను ఉద్దేశించి చేసిన అరగంట ప్రసంగంలో రామారావు గారు తాను మ్యానిఫెస్టోలో చేసిన ప్రతి వాగ్దానాన్నీ పూర్తి చేస్తానన్నారు.ప్రజలకు సేవ చేయాలనేదే జీవితంలో తన ఏకైక కోరిక అని ఆయన నొక్కి చెప్పారు.

రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన దైనందిక జీవనశైలిలో మార్పులేదు.విశ్రాంతికి అవకాశమే లేదు.ప్రజాసంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు.ఆయనకు అధికారం అంటే విలాసం కాదు,బాధ్యత. క్రమశిక్షణ,క్రమవర్తన,సమయపాలన ఆయన జీవితసూత్రాలు.అవి ఆయన రాజకీయ జీవితంలో కూడా భాగమయ్యాయి.

ముఖ్యమంత్రిగా జీతము తీసుకోనని రామారావు గారు చెప్పారు.కానీ ప్రభుత్వ నిబంధనలు దానికి ఒప్పుకోవు.అందుకని నెలకు ఒక రూపాయి గౌరవ వేతనంగా తీసుకొనేందుకు అంగీకరించారు. వైభవోపేతమైన ముఖ్యమంత్రి నివాసానికి మారడానికి ఆయన అంగీకరించలేదు. తన అబిడ్స్ ఇల్లు తనకు చాలన్నారు.ఖరీదైన విలాసమంతమైన కార్లను వద్దన్నారు.అంబాసిడర్ కారు చాలన్నారు. ముఖ్యమంత్రి హెూదాకు అనుబంధంగా వచ్చే ఎన్నో విలాసాలను సౌకర్యాలను ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నారు.