Devotional

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఇదే? – TNI ఆధ్యాత్మిక వార్తలు

వైకుంఠ ఏకాదశి  ప్రత్యేకత ఇదే? – TNI ఆధ్యాత్మిక వార్తలు

వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఇదే?
*మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అంత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.

**ముక్కోటి ఏకాదశి పేరు వెనుక పురాణ కథనాలు
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.

**మురాసుర సంహారం
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, రుషులను, ప్రజానీకాన్ని పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో, మురాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు బయల్దేరతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు.

**వైకుంఠ ఏకాదశి నాడు నమ్మాళ్వార్ శివైక్యం
వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ నమ్మాళ్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాత:కాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు.

*వైకుంఠ ద్వాదశి రోజున శ్రీవారి పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు
వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్రార (ఉత్తరభాగం) శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఉత్తరద్వార దర్శనం భక్తులకు శుభప్రదం. లియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం.

2.తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. మొన్నటి వరకూ 30 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. మంగళవారం 23,744 మంది భక్తులు మాత్రమే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 12,057 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

3.అహోబిలం దేవస్థానంలో కరోనా కలకలం
కర్నూల్ జిల్లాలోని అహోబిలం దేవస్థానంలో కరోనా కలకలం రేగింది. ఆలయ సిబ్బందిలో ఒకరికి అలాగే అతని తండ్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు ఐసోలేషన్లో ఉన్నారు. ఇద్దరికి కరోనా అని తేలడంతో రేపు జరుగబోయే వైకుంఠ ద్వార దర్శనానికి కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కార్యనిర్వహణ అధికారి స్పష్టం చేశారు.