Movies

జగన్ సోదరుడిగా ఆహ్వానించారు. ఎవరూ నోరు జారవద్దు.

జగన్ సోదరుడిగా ఆహ్వానించారు. ఎవరూ నోరు జారవద్దు.

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో జరిగిన భేటీ సంతృప్తినిచ్చిందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. సీఎం ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో ఆయనతో చిరంజీవి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ తిరుగుప్రయాణంలో గన్నవరం విమానాశ్రయంలో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ సమావేశం చాలా సంతృప్తికరంగా జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. సీఎం నన్ను ఓ సోదరుడిగా పండగ వేళ భోజనానికి ఆహ్వానించి, నాతో ఆప్యాయంగా మాట్లాడిన తీరు బాగా నచ్చింది. ఆయన సతీమణి భారతిగారూ వడ్డించటం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సినిమా టికెట్‌ ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు. కొలిక్కిరాని ఈ సమస్య జటిలమవుతోన్న నేపథ్యంలో సీఎం గారు ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటం కాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. ఆయన నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది. సామాన్యుడికీ వినోదం అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. చిత్ర పరిశ్రమ, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమానుల సాధకబాధకాల గురించి ఆయనకు వివరించా. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని, కమిటీ తుది నిర్ణయానికొస్తుందని తెలిపారు’’ అని చిరంజీవి వివరించారు.